గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారుల సన్నాహాలు
దండేపల్లి, కోటపల్లి, తాండూర్,లక్షెట్టిపేట, కాసిపేటలో అధికారుల పరిశీలన
దండేపల్లి, మే 24 : కరోనా రెండో దశ మహమ్మారి పల్లె ప్రజలనూ వణికిస్తున్నది. పల్లె ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలు చిన్న పాటి గదుల్లో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఒకరికి కొవిడ్ సోకితే మరొకరికి సోకకుండా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. కరోనా సోకి హోంఐసోలేషన్ సౌకర్యం లేని బాధితులకు బాసటగా నిలవాలని నిర్ణయించి, విలేజ్ ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చొరవ తీసుకోనున్నారు. దండేపల్లి పీహెచ్సీ పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాల, తాళ్లపేట పీహెచ్సీ పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలను విలేజ్ ఐసొలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు.
ఇవీ ఏర్పాట్లు…
తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు సౌకర్యం ఉన్న భవనాలనే విలేజ్ ఐసొలేషన్ సెంటర్గా ఎంచుకోనున్నారు. పడకలు ఏర్పాటు చేసి, దుప్పట్లు, ఇతర సా మగ్రి బాధితులే తెచ్చకునేలా అవగాహన కల్పించనున్నారు. వాళ్ల ఇంటి నుంచే భోజనాలు తెప్పించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు, సర్పంచ్లు, స్వచ్ఛంద సంస్థలు భోజన సౌకర్యాలు కల్పించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు సేవలు అందించనున్నారు. స్థానిక వైద్యాధికారులు ప్రతి రోజు ఈ సెంటర్లను పర్యవేక్షిస్తారు. వైద్యాధికారితో పాటు సర్పంచ్, కార్యదర్శులు విలేజ్ ఐసొలేషన్ సెంటర్లకు ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు.
రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు
దండేపల్లి, తాళ్లపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో రెండు, మూడు రోజుల్లో విలేజ్ ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎవరికైతే పాజిటివ్గా నిర్ధారణ అయి, హోం ఐసొలేషన్ సౌకర్యం లేనివారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హోం ఐసొలేషన్లో ఉన్నవారికి భోజన సౌకర్యంపై స్వచ్ఛంద సంస్థలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఐసోలేషన్ సెంటర్ పరిశీలన
కోటపల్లి, మే 24 : మండలంలో కరోనా కేసులు పెరుగుతన్న దృష్ట్యా కొవిడ్ బాధితులకు స్థానికంగా వసతి కల్పించేందుకు కోటపల్లి మోడల్ స్కూల్ను డీఆర్డీవో శేషాద్రి సోమవారం పరిశీలించారు. మండలంలో ఎవరికైనా కరోనా సోకి, వారి ఇళ్లల్లో సరైన సౌకర్యాలు లేనివారికి ఈ కేంద్రంలో వసతి కల్పించనున్నట్లు డీఆర్డీవో వివరించారు. బాధితులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొవిడ్ బాధితులకు భోజన వసతి కల్పించేందుకు మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్వచంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ దేశ్పాండే, ఎంపీడీవో కే భాస్కర్, వైద్యాధికారి సత్యనారాయణ, ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణ, ఏపీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ రాగం రాజక్క, ఆర్ఐ జశ్వంత్ పాల్గొన్నారు.
కేజీబీవీలో..
తాండూర్, మే 24 : మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఐసొలేషన్ సెంటర్ను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశమై ఐసొలేషన్ కేంద్రం ఇన్చార్జీలను నియమించారు. అనంతరం కేజీబీవీలోని ఐసోలేషన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి గజానంద్, ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీడీవో శశికళ, ఎంపీవో అక్తార్ అలీ, డాక్టర్ కుమారస్వామి, అభినవ సంస్థ అధ్యక్షుడు సంతోష్కుమార్, అన్ని గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట రూరల్, మే 24 : మండలంలో విలేజ్ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు పలు పాఠశాల భవనాలను అధికారులు సోమవారం పరిశీలించారు. దౌడేపల్లి, తిమ్మాపూర్,గుళ్లకోట, లక్షెట్టిపేట గురుకుల పాఠశాలలను పరిశీలించారు. అనంతరం వెంకట్రావు పేట పీహెచ్సీని పరిశీలించి వసతులను తెలుసుకు న్నారు. కార్యక్రమం లో జిల్లా వ్యవసాధికారి వినోద్ కుమార్, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో సత్యనారాయణ, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, ఎంపీవో అజ్మత్ ఆలీ, ముత్తె సత్తయ్య, డాక్టర్ ప్రసాద రావు, ఏటీడబ్ల్యూ చిరంజీవి, సర్పంచ్లు చుంచు రవి, గోళ్ల రవీందర్, జాడి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, మే 24 : కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కార్మెల్ హై స్కూల్ దేవాపూర్, దేవాపూర్ ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా పాఠశాలల్లో ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి పరిశీలించారు. సదుపాయాల వివరాలను సేకరించారు. కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ నారాయణ, తహసీల్దార్ భూమేశ్వర్, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీడీవో ఎంఏ అలీం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఓసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, మడావి అనంతరావు, సర్పంచ్లు ఆడె బాదు, దరావత్ దేవి, ఉప సర్పంచ్లు పిట్టల సుమన్, తిరుపతి, కార్యదర్శి కవిత తదితరులు పాల్గొన్నారు.