నిత్యావసరాలు, సరుకులు, మాంసం.. అన్నీ ఒకేచోట లభ్యం
నగరంలోని సమీకృత మార్కెట్కు పెరిగిన ఆదరణ
ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆలోచన
లాక్డౌన్ సమయంలో సద్వినియోగం
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రద్దీ
ఖమ్మం, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమీకృత మార్కెట్ వినియోగదారులకు వరంలా మారింది. అన్ని నిత్యావసర సరకులు ఒకేచోట లభిస్తుండడంతో వారికి సమయం ఆదా అవుతున్నది. నాణ్యతతోపాటు సరసమైన ధరలకు సరుకులు, నిత్యావసరాలు దొరుకుతున్నాయి. మార్కెటింగ్శాఖ నిత్యం క్రయ, విక్రయాలను పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నది. కొత్త బస్టాండ్ సమీపంలో 1.20 ఎకరాల విస్తీర్ణంలో రూ.4కోట్లతో సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేశారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు అనుమతి ఉండడంతో నగరవాసులు అన్నీ ఒకేచోట దొరికే సమీకృత మార్కెట్కు రావడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు, ఇక్కడ అంతర్భాగంగా సమీకృత రైతుబజార్నూ ఏర్పాటు చేయించారు. ఈ మార్కెట్ ద్వారా 600 నుంచి 700 మంది కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది.
ప్రజల అవసరాలపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేసిన ముందస్తు ఆలోచన ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నది.. కొత్త బస్టాండ్ సమీపంలో 1.20 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్లతో నగరవాసుల కోసం ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ కొవిడ్ సమయంలో వినియోగదారులకు వరంగా మారింది. లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు అనుమతి ఉండడంతో నగరవాసులు అన్నీ ఒకేచోట దొరికే సమీకృత మార్కెట్కు వస్తున్నారు. కూరగాయల నుంచి మాంసాహారం వరకు, నిత్యావసరాల నుంచి పూలు, పండ్ల వరకూ అన్నీ ఒకే చోట దొరికేలా ఏర్పాట్లు ఉన్నాయి. నాణ్యతతో పాటు సరసమైన ధరలకు సరుకులు, నిత్యావసరాలు దొరుకుతుండడంతో నగరవాసులు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు. మార్కెటింగ్ శాఖ నిత్యం క్రయ, విక్రయాలను పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తున్నది.
వేలం ద్వారా షాపుల కేటాయింపు..
సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్కు సంబంధించి చికెన్, మటన్, చేపలు విక్రయించుకునేందుకు కాంప్లెక్స్లో 38 దుకాణాలను ఏర్పాటు చేశారు. అధికారులు మరో ఎనిమిది దుకాణాల్లో టీ స్టాల్, నిత్యావసరాలకు అవకాశం కల్పించారు. టెండర్ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయించారు. ఎనిమిది షాపులకు సంబంధించి నెలకు రూ.4 వేల చొప్పున అద్దె నిర్ణయించారు. 38 షాపులకు ఒక్కో షాపునకు నెలకు రూ.1,650 చొప్పున అద్దె నిర్ణయించి వ్యాపారులకు అప్పగించారు. వాటిలో అధునాతనమైన సౌకర్యాలు కల్పించారు.
రైతుబజారులో విక్రయాలు..
సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లో అంతర్భాగంగా రైతుబజార్ ఏర్పాటైంది. ఇక్కడ నాలుగు షెడ్లు ఏర్పాటయ్యాయి. ఒక షెడ్లో 64 మంది కూరగాయలు విక్రయించుకునేందుకు వీలుగా రూపకల్పన జరిగింది. రెండో షెడ్లో 44 మంది కూరగాయలు విక్రయించుకునే ఏర్పాట్లు ఉన్నాయి. మూడో షెడ్లో అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవకాశం ఇచ్చారు. పూల విక్రయాలకు అనువుగా 10 మంది వ్యాపారులకు షెడ్లు కేటాయించారు. అలాగే చిన్నకారు రైతుల కోసం మూడు షెడ్లు నిర్మించారు. వీటిలో సుమారు 450 మంది రైతులు కూరగాయలు, ఆకుకూరలను విక్రయించుకునేలా నిర్మాణాలు ఉన్నాయి. కిరాణా సరుకులు, ఉల్లిపాయలు విక్రయించేందుకు 36 షెట్టర్లు, పండ్ల విక్రయం కోసం 13 షెడ్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు, ఇతరులకు పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ద్విచక్రవాహనాలు, ఫోర్వీలర్ల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
700 కుటుంబాలకు ఉపాధి…
నగరంలోని నూతన బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఖమ్మం నగరవాసులతో పాటు జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకారిగా మారింది. నూతన బస్టాండ్కు సమీపంలో ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు వేరే చోటకు వెళ్లకుండా ఇక్కడే వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మార్కెట్ ద్వారా 600 – 700 మంది కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది.
గజ్వేల్, సిద్దిపేట తరహాలో నిర్మాణం
రాష్ట్రంలో గజ్వేల్, సిద్దిపేట తర్వాత ఖమ్మంలో మూడో అతిపెద్ద సమీకృత మార్కెట్ ఏర్పాటైంది. మార్కెట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయించేందుకు మంత్రి అజయ్కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పనులను నిత్యం పర్యవేక్షించారు. సమీకృత మార్కెట్లో అంతర్భాగంగా సమీకృత రైతుబజార్నూ ఏర్పాటు చేయించారు.
అన్నీ ఒకేచోట లభ్యం..
ఇతర ప్రదేశాలకు వెళ్లకుండానే అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి. సరసమైన ధరలకు ఉల్లిగడ్డల నుంచి మొదలుకొని ఆకుకూరలు, కూరగాయలు, మాంసం లభిస్తున్నాయి. లాక్డౌన్లో ఇన్నిరకాల కూరగాయలు, ఇతర సామగ్రి అన్నీచోట దొరుకుతున్నాయి. సమీకృత రైతుబజార్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.