నాల్గో రోజూ ముమ్మరంగా జ్వర సర్వే
ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించిన ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు
రంగారెడ్డి జిల్లాలో 9,170 ఇండ్ల సర్వే
వికారాబాద్ జిల్లాలో 34,626 ఇండ్ల సర్వే పూర్తి
కరోనా లక్షణాలున్నవారికి మందులు పంపిణీ
హోం ఐసొలేషన్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సర్వే తీరును పర్యవేక్షించిన ఉన్నతాధికారులు
పరిగి, జనవరి 24: కరోనా నియంత్రణ కోసం చేపట్టిన జ్వర సర్వే చకచకా సాగుతున్నది. నాల్గో రోజూ ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు ఇంటింటికీ వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్నవారిని గుర్తించి మందులను అందజేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలో 9,170 ఇండ్లను సర్వే చేయగా, వికారాబాద్ జిల్లాలో 34,626 ఇండ్ల సర్వేను పూర్తి చేశారు. పలువురికి వ్యాక్సిన్ వేసి కరోనాపై అవగాహన కల్పించారు. హోం ఐసొలేషన్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మందుల కిట్లను అందించారు. ఈ నాలుగు రోజుల్లో మొత్తం రంగారెడ్డి జిల్లాలో 67,802 ఇండ్ల సర్వే పూర్తి కాగా, వికారాబాద్ జిల్లాలో 1,26,199 ఇండ్ల సర్వేను పూర్తి చేశారు. వైద్యసిబ్బంది చేస్తున్న సర్వే తీరును ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
కొవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే వికారాబాద్ జిల్లాలో చురుగ్గా సాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రత్యేక బృందా ల సభ్యులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. సోమవారం జిల్లా పరిధిలో 764 ప్రత్యేక బృందాల సభ్యులు 34,626 కుటుంబాల్లో జ్వర సర్వే చేపట్టారు. జిల్లాలో ఇప్పటివరకు 1,26,199 కుటుంబాల్లో సర్వే పూర్తయింది. అంతేకాకుండా వైద్యసిబ్బంది అర్హులైన వారి కి కొవిడ్ టీకాలను కూడా వేస్తున్నారు. సోమవారం జిల్లా పరిధిలో 15 నుంచి 18 ఏండ్లలోపు 270 మం దికి, 18 ఏండ్లు పైబడిన వారిలో మొదటి డోసు 749 మందికి, రెండో డోసు 2,990 మందికి, 60 ఏండ్లు నిండిన 53 మందికి బూస్టర్ డోస్ టీకాలు వేశారు.
రంగారెడ్డి జిల్లాలో 9,170 కుటుంబాల్లో..
షాబాద్, జనవరి 24: రంగారెడ్డి జిల్లాలో జ్వర సర్వే ముమ్మరంగా సాగుతున్నది. జిల్లాలో 678 బృందాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ లక్షణాలు ఉన్నవారికి వైద్యుల సూచనల మేరకు మందులను అందిస్తున్నారు. అంతేకాకుండా కొవిడ్ టీకాలను కూడా ఇస్తున్నారు. సోమవారం జిల్లాలోని 9,170 కుటుంబా ల్లో జ్వర సర్వే చేశారు. గత నాలుగు రోజులుగా జిల్లా లో 67,802 కుటుంబాల్ల్లో జ్వర సర్వే పూర్తయింది.