కల్లాల్లో మొసలి కన్నీరు కారుస్తున్నరు
ధర్నా చేద్దామంటున్నరు.. ధర్నాలు మాకేం కొత్తకాదు
కొట్లాడే తెలంగాణ తెచ్చుకున్నం
కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. బీజేపీ సర్కారు మా బతుకులు ఆగం చేస్తున్నది
డీజిల్ రేట్లు పెంచి రైతు నడ్డి విరిచింది
కేంద్రాన్ని ఒప్పించి వడ్లు కొనిపించాలె
బీజేపీ నేతలను నిలదీసిన రైతు యెలిపెద్ది యాదవరెడ్డి
కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడ్తది…బీజేపోళ్లేమో పరామర్శలకు వస్తారా?
యాదాద్రి భువనగిరి, నవంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) /గుండాల:
కమలనాథుల కపట నాటకాలకు కడుపు మండిన రైతన్న మర్లవడ్డడు. బీజేపీ దండు దండయాత్రలా వచ్చినా.. అదరక, బెదరక బెబ్బులిలా నిలదీసిండు. కేంద్రంలోని
మీ ప్రభుత్వం వడ్లు కొనదు, మీరేమో కల్లాల దగ్గరికి వచ్చి మొసలి కన్నీరు కారుస్తరా? అంటూ కడిగిపారేసిండు. మంగళవారం గుండాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, ఆ పార్టీ నాయకులకు రైతు యెలిపెద్ది యాదవరెడ్డి చుక్కలు చూపించిండు. మీ పౌర సరఫరాల మంత్రికి ఫోన్ చెయ్.. అని పట్టుపట్టిండు. తోటి రైతులు సైతం అడిగే ప్రశ్నలకు బదులు చెప్పలేక పొంతనలేని సామెతలతో బీజేపీ నేతలు అక్కడి నుంచి తోకముడిచారు. యాదవరెడ్డిని నమస్తే తెలంగాణ పలుకరించగా, రైతాంగం ఆవేదనను వినిపించాడు.
గుండాల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి జెండాలు పట్టుకుని వచ్చిన బీజేపీ నాయకులను యాదవరెడ్డి కడిగిపారేశాడు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఆయన్ని పలుకరించగా.. కేంద్ర వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాటల్లోనే..‘నాకు పదకొండు ఎకరాల భూమి ఉంది. కొంత భూమి నా పేరున ఉన్నది. మిగిలింది ఇద్దరు కొడుకుల పేరున చేసిన. ఐదు ఎకరాల్లో వరి. మరో నాలుగు ఎకరాల్లో పత్తి వేస్త. రెండు ఎకరాల్లో కంది పండిస్తా. రైతు బంధు డబ్బులు కారుకు 55వేలు వస్తున్నయ్. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పంటలను సాగు చేసిన. పోయినసారి యాసంగిలో ధాన్యాన్ని మంచిగనే అమ్ముకున్నా. 250 చిన్న బస్తాల వడ్లను అమ్మిన. లక్షా డ్బైవేల రూపాయలు నా అకౌంట్ల జమ అయినయి. ఈసారి కూడా వడ్లను గుండాలలో కో ఆపరేటివ్ ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసిన. కానీ.. బీజేపీ నేతలు పెడుతున్న ఇబ్బందులతో ఈసారి అమ్ముకోలేక పోతున్నం. వారి అసమర్థతను కప్పిపుచ్చేందుకే ఈ డ్రామాలు ఆడి రైతులను మోసం చేస్తుండడంతో కడుపు మండిపోయింది.అందుకు ఉండబట్టలేక కడిగి పారేసిన.
ఇబ్బందులు పెడుతూ పరామర్శలకు వస్తే ఎట్లా..
బీజేపీ పెడుతున్న ఇబ్బందుల వల్ల రైతులం నానా అవస్థలు పడుతున్నం. కొనుగోలు కేంద్రాలకు వచ్చి వడ్లు కొనకుండ చేస్తున్నరు. ఇప్పటికి రెండుసార్లు మొలకొచ్చినయ్. రాశులను తర్ల పోసినం. మళ్లీ మొలక లొస్తున్నయ్. కేంద్రం పెడుతున్న కొర్రీలు, ఇబ్బందులతో ఎంతో నష్టపోతున్నం. ఓసారి బాయిల్డ్ రైస్ అంటరు.. మరోసారి రా రైస్ కావాలంటరు. కనీసం కేసీఆర్ ఇస్తున్న రైతు బంధుతో వ్యవసాయం చేసుకుంటున్నగానీ.. రైతులు బతుకలేని పరిస్థితి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇన్ని ఇబ్బందులు పెడుతున్న బీజేపీ నేతలు జెండాలతో కళ్లాలకు వచ్చి రైతులను పరామర్శిస్తామనడం ఎంత వరకు కరెక్టో వాళ్లే అర్థం చేసుకోవాలె. వారికి కనీసం ఇంకింత జ్ఞానం కూడా లేదు. ఎఫ్సీఐ అర్థం తెలవకుండా మూర్ఖత్వంతో తెలంగాణ ప్రభుత్వం మీద అసత్య ప్రచారం చేస్తున్నరు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలి. తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
బీజేపీ తీరు సిగ్గు చేటు..
డీజిల్, పెట్రోల్ రేట్లను పెంచి కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. కనీసం ఆడోళ్లు వంట కూడా చేసుకోనియ్యకుండ గ్యాస్ రేటు పెంచింది. బీజేపీ నాయకులుగానీ.. పాలకులు కానీ ఆలోచన చెయ్యాలె. పెట్రోల్ రేటును పెంచడం వల్ల బండ్లు ఉన్నోళ్లే ఇబ్బందులు పడుతుండొచ్చు గానీ.. డీజిల్ రేట్లు పెంచడం వల్ల రైతులు నానా అవస్థలు పడుతున్నరు. వ్యవసాయం చేసుకునే రైతులకు ఇది పెనుభారమే.
మొసలి కన్నీరు కాదు.. కేంద్రాన్ని ఒప్పించాలె..
కల్లాల వద్దకు వచ్చే బీజేపీ నాయకులు మొసలి కన్నీరు గార్చడం తప్ప.. రైతులకు చేసేదేం లేదు. మేమేదో చేస్తున్నం అని.. కల్లబొల్లి మాటలు చెప్పడం తప్పితే రైతుల కష్టాలను తీరుస్తున్నదేం లేదు. ఇప్పటికైనా కండ్లు తెరవాలి. కేంద్రాన్ని ఒప్పించి యాసంగి ధాన్యాన్ని కొనే బాధ్యత తీసుకోవాలి.
ఏం చెప్పకుంటనే వాపస్ పోయినరు..
కేంద్ర ప్రభుత్వం మీదే కదా. మీరు ఒక్క ఫోన్ చేస్తే కలెక్టర్ వస్తరు. సివిల్ సప్లయ్ మంత్రి వస్తరు. బీజేపీ నాయకుడు శ్యాంసుందర్ను గట్టిగనే అడిగిన. ధర్నా చేద్దాం రండి అని పిలిచిర్రు. ధర్నా చేసుడు ఈ రోజు మాకు కొత్తేమి కాదు. ధర్నాలు, రాస్తారోకోలు చేసి తెలంగాణ తెచ్చుకున్నం. ధర్నా చేసుడు మేం కాదు.. మీరే కేంద్రాన్ని ఒప్పించండి అని అడిగిన. ఏం చెప్పాల్నో తెలవక వాపస్ పోయిర్రు. అని చెప్పుకచ్చాడు యాదవరెడ్డి