విరబూసిన పువ్వుల్లాంటి ఈ నవ్వులు చూశారా!
చెప్పలేనంత సంతోషంతో విప్పారిన ఈ కండ్లను గమనించారా!!
ఎంత ఆనందం ఉంటే కల్మశం లేని
ఈ పసి మనస్సులు ఇంత హాయిగా నవ్వుతుండాలి!!!
యాదాద్రి, నవంబర్ 22 : యాదగిరిగుట్టలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతిగృహ విద్యార్థినుల కోసం ఆర్టీసీ అధికారులు సోమవారం నుంచి ప్రత్యేక బస్సును నడిపిస్తున్నారు. ఈ వసతిగృహంలో హైదరాబాద్, మోత్కురు, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరుతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 80 మంది విద్యార్థినులు నివాసముంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరంతా పట్టణంలోని గోశాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, యాదగిరిపల్లి పోచమ్మవాడ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే పాఠశాల నుంచి హాస్టల్కు బస్సు లేక పోవడంతో ప్రతిరోజూ కాలినడకనే వెళ్తున్నారు. చినుకు పడితే దుస్తులే కాకుండా, బ్యాగుల్లోని పుస్తకాలు కూడా తడుస్తున్నాయి. నడక ఇబ్బందులు పడలేక చాలా మంది తమ ఇళ్లకు వెళ్లి పోతుండడంతో హాస్టల్లో విద్యార్థినుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.
హాస్టల్ అధికారి చొరవతో
విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను వసతి గృహం సంక్షేమాధికారి సోనీ జిల్లా సంక్షేమాధికారి జయపాల్రెడ్డి, యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో అధికారులు ఉదయం 9గంటలకు హాస్టల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లడంతో పాటు సాయంత్రంతీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సు వేశారు. సోమవారం అధికారులు ప్రారంభించగా విద్యార్థినులు ఆనందంగా బస్సెక్కి పాఠశాలకు వెళ్లారు. వార్డెన్ కృషితో తమకు నడక యాతన తప్పినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.