యాదాద్రి, నవంబర్22 : యాదాద్రి కొండపై గల పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి కార్తిక మాసం సందర్భంగా సోమవారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్త జనులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులు యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. సుప్రభాతవేళ మొదటగా పరమశివున్ని కొలుస్తూ సుమారు గంటన్నరపాటు జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. లక్ష్మీనరసింహుని బాలాలయంలో సుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవం జరిపించారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులు సత్యనారాయణ వ్రతాల్లో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు దీపారాధన చేసి స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు.శ్రీవారిఖజానాకు సోమవారం రూ. 15,99,312 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.