రామగిరి, నవంబర్ 22 : సమస్త జీవకోటికి నీరు ఎంతో అవసరమని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరమళ్ల ప్రకాశ్రావు అన్నారు. ఎంజీయూ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘జల సాక్షరత’(వాటర్ లిట్రసీ) సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూమి మీద నీరు 71శాతం, భూమి 29శాతం ఉన్నా అందులో 3శాతం మాత్రమే మంచినీరు ఉందన్నారు. 3శాతంలో సైతం 2శాతం ద్రవాలు మంచు రూపంలో ఉండగా మిగిలిన నీరు ఒక్క శాతమేనన్నారు. భూమి, వాతావరణంలో కాలుష్యం పెరిగి భూమిలో తేమ తగ్గుతుందన్నారు. భవిష్యత్ తరాలకు నీరు ఎంతో అవసరం కనుక నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తెలంగాణ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ ఎం.శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మన దేశంలో నీటి సంరక్షణ విధానాలు పాటించడంలో వెనుకబడి ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జల సంబంధమైన ఎన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేయడంతో తాగు, సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఇది జరగలేదన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు తర్వాత ఫ్లోరైడ్ నీటితో బాధపడుతున్న ప్రాంతాలకు నేడు స్వచ్ఛమైన జలాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. విశ్రాంత ప్రిన్సిపాల్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో జలం అందుబాటులోకి వచ్చిందన్నారు. జల సాధన సమితి ఉద్యమమే నీటి ఉద్యమాలకు అంకురార్పణ జరిగిందన్నారు. ఎంజీయూ వీసీ సీహెచ్.గోపాల్రెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ విధానాలు పూర్తిస్థాయిలో లేవని జల సంబంధమైన పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలకు బాల్యం నుంచే నీటి ఆవశ్యకతను వివరించాలన్నారు. ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ దోమల రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో పర్యావరణవేత్త మిట్టపల్లి సురేష్గుప్త, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆకుల రవి, ఆడిట్ సెల్ మాజీ డైరెక్టర్ అల్వాల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ శ్రీదేవి, హాస్టల్స్ డైరెక్టర్ ప్రేమ్సాగర్, ప్లేస్మెంట్ అధికారి ప్రశాంతి, అధ్యాపకులు పాండరయ్య, శివరాం, శశిధర్, విద్యార్థులు పాల్గొన్నారు.