
చదువుకుంటూ ఆటో డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థిని
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకు
శాలిగౌరారం, నవంబర్ 22 : చదువంటే ఆ అమ్మాయికి అమితమైన ఇష్టం. ప్రైమరీ విద్య స్వగ్రామంలో పూర్తి చేసింది. ఈ సమయంలో తండ్రి కాలం చేశాడు. పై చదువులకు వెళ్లాలంటే బస్సు ఎక్కాల్సిందే. కానీ, బస్సు చార్జీలు కూడా లేని నిరుపేద కుటుంబం ఆమెది. ఈ క్రమం లో ఆమె ఆత్మైస్థెర్యమే ముందుకు నడిపించింది. ఓ పక్క చదువుతూనే ఆటో డ్రైవర్ అవతారమెత్తింది. వచ్చిన డబ్బుతో తాను చదువుకుంటూ తల్లిని పోషిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఆమే శాలిగౌరారం మండలం వంగమర్తికి చెందిన సబిత. గ్రామానికి చెందిన నామరమల్ల నర్సయ్య, రమణ దంపతుల ఒక్కగానొక్క కూతురు. మొదటి నుంచీ నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ పోషణ కోసం గ్రామంలోని అమ్మ పాట హోటల్లో చేరి తన ఇంటిల్లిపాదితో పనికి కుదిరాడు నర్సయ్య. కాలక్రమేణా అనారోగ్యానికి గురికావడంతో 2015లో మృతి చెందాడు. దీంతో తల్లి రమణ తన కూతురును సాకుతూ అదే హోటల్లో పని చేస్తూ కాలం వెల్లదీస్తున్నది.
సర్కారు స్కూళ్లల్లో చదువు..
సబిత వంగమర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు కేతేపల్లి మండలం చెరుకుపల్లి కసూర్బాగాంధీ ఆశ్రమ పాఠశాలలో చదివి ప్రథమ ర్యాంక్తో రాణించింది. పై చదువుల కోసం నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. కళాశాల ముగిశాక హోటల్లో అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆసరాగా నిలుస్తుంది.
సెకండ్ హ్యాండ్ ఆటో కొని..
రోజూ కళాశాలకు వెళ్లాలంటే రూ.100 ఖర్చవుతుంది. అదే ఆటో ఉంటే తన చార్జి పోను మిగిలిన డబ్బుతో ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చన్న ఉపాయంతో హోటల్ యజమాని వెంకటేశాన్ని ఒప్పించి సబిత సెకండ్ హ్యాండ్ ఆటో కొనుగోలు చేసింది. అతని వద్దనే ఆటో తోలడం నేర్చుకుంది. గత 3 నెలలుగా ఆటోను వంగమర్తి -నకిరేకల్కు ప్రయాణికులను తీసుకెళ్తూ కళాశాలకు వెళ్తున్నది. సాయంత్రం కళాశాల ముగిశాక స్వగ్రామానికి చేరుకుంటుంది. ఈ క్రమంలో వచ్చిన డబ్బుతో ఇంటి అవసరాలు తీర్చుతున్నది.