పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను తీర్చిదిద్దినందుకు ప్రశంస
జిల్లా పర్యటన కోసం సీఎంవోకు ఆల్బమ్ను పంపిన అధికారులు
ఏన్కూరు, జూన్ 22: మండలంలోని నూకాలంపాడు గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. పల్లెప్రగతి పనుల్లో భాగంగా ప్రకృతివనాన్ని, వైకుంఠధామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు ప్రశంసలు దక్కాయి. సర్పంచ్ ఇంజం శేషగిరిరావు ప్రత్యేక కృషితో తీర్చిదిద్దిన పల్లెప్రగతి పనులను ఆల్బమ్గా తయారు చేసి అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన కోసం నూకలంపాడును ఎంపిక చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. జిల్లా అధికారులు కూడా ఇటీవల నూకలంపాడును సందర్శించి సర్పంచ్ను ప్రత్యేకంగా అభినందించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతి రోజూ వచ్చి ఈ ప్రకృతి వనాన్ని సందర్శిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో పల్లెప్రకృతివనం, మరో ఎకరం విస్తీర్ణంలో వైకుంఠధామం, ఇంకో ఎకరం స్థలంలో కంపోస్ట్షెడ్ కలిపి ఒకేచోట ఉండడం విశేషం. పల్లెప్రకృతివనంలో సుమారు 5 వేల పండ్ల, పూల, నీడనిచ్చే మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పార్కు మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఆకర్షణీయంగా నిలిచింది. వైకుంఠధామంలో ప్రత్యేక ఆకర్శణగా నంది, శివుడు, కాటికాపరి విగ్రహాలు ఉన్నాయి. ఖాళీ ప్రదేశంలో కొబ్బరిమొక్కలను నాటారు. దీంతో పల్లెప్రకృతివనం ఆహ్లాదాన్ని పంచుతోంది.