పరిగి, జనవరి 22 : ఇంటింటి జ్వర సర్వేతో కరోనా కట్టడి అవుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాలనిచ్చిందని, నీతి ఆయోగ్ సైతం జ్వర సర్వేను ప్రశంసించిందని చెప్పారు. శనివారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రెండు, ఆరు వార్డుల్లో నిర్వహించిన జ్వర సర్వేలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయా కుటుంబాలవారితో మాట్లాడి ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జ్వర సర్వేకు వచ్చిన బృందం సభ్యులకు ఆయా కుటుంబాలవారు తప్పనిసరిగా తమకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే తెలియజేయాలని సూచించారు. ఇలాంటి లక్షణాలు గల వారికి ప్రత్యేకంగా ఇంటి వద్దే వైద్యం కోసం హోం ఐసొలేషన్ కిట్లు అందిస్తామన్నారు. ఈ లక్షణాలున్నవారు ఇండ్లలోనూ మాస్కులు ధరించాలన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స అవసరమైన వారి కోసం సర్కారు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు సైతం సిద్ధం చేసి ఉంచారని తెలిపారు. చక్కటి పౌష్టికాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా దగ్గు, జ్వరం లక్షణాలున్న వారికి మందుల కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, మండల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు ఆంజనేయులు, సంతోష్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు అర్చన, నాగేశ్వర్, మునీర్, టీఆర్ఎస్ నాయకులు రవికుమార్, గౌస్పాషా, ఫసియోద్దీన్, ఆసిఫ్ పాల్గొన్నారు.
పరిగి డివిజన్ పరిధిలో…
పరిగి, జనవరి 22 : పరిగి డివిజన్ పరిధిలోని పరిగి పట్టణం, పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లో శనివారం రెండో రోజు ఇంటింటి జ్వర సర్వే కొనసాగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బృందాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబాల వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారికి వైద్య సిబ్బంది మందులు అందజేశారు. ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నారు, వారు వ్యాక్సిన్ తీసు కున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా సూచించారు. పరిగి మండలం రంగాపూర్తండాలో ఎంపీపీ కరణం అరవిం దరావు, ఎంపీడీవో శేషగిరశర్మ ఇంటింటికీ జ్వర సర్వేను పరిశీలించడం తోపాటు వ్యాక్సినేషన్ను పర్యవేక్షించారు. ఆయా మండలాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, వైద్యాధికారులు పర్యవేక్షించారు.
తాండూరులో…
తాండూరురూరల్, జనవరి 22 : అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసు కోవాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని నాలుగో వార్డులో నిర్వహించిన జ్వర సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ టీకా తీసుకున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి, వారిలో వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేయాలని సూచించారు. సర్వేలో భాగంగా పట్టణంలో 40 మంది నుంచి రక్త నమూనాలు సేకరిం చినట్లు వైద్యులు తెలిపారు. కొవిడ్పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకుంటూ ఉండాలన్నారు. ప్రభుత్వ సూచనలు అందరూ పాటించాల్సిన అసవరం ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీపానర్సింహులు, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
వికారాబాద్లో జోరుగా…
వికారాబాద్, జనవరి 22 : కరోనా నియంత్రణకు రాష్ఘ్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ జ్వర సర్వే రెండో రోజు శనివారం వికారాబాద్ నియోజకవర్గం లోని బంట్వారం, మర్పల్లి, కోట్పల్లి, ధారూరు, మోమిన్పేట, నవాబుపేట మండలాల్లోని గ్రామాల్లో జోరుగా సాగింది. అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఆర్పీలు టీమ్ లుగా ఏర్పడి జ్వర సర్వేను నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తూ .. కొవిడ్ బాధితులను గుర్తించి సూచనలు అందజేస్తున్నారు.
బొంరాస్పేటలో..
బొంరాస్పేట, జనవరి 22 : మండలంలో శనివారం 1291 ఇండ్లలో సర్వే నిర్వహించారు. జ్వరం, జలుబు, లక్షణాలతో బాధపడుతున్న వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందజేశామని సిబ్బంది తెలిపారు.