టేకులపల్లి, జనవరి 16: నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. టేకులపల్లి మండలం బోడురోడ్డు సెంటర్ నుంచి తడికలపూడి క్రాస్ రోడ్డు వరకు ఉన్న ప్రధాన రహదారిని ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో బయ్యారం, ఇల్లెందు, టేకులపల్లి మండలాల మీదుగా జాతీయ రహదారి నెంబర్ ఎన్హెచ్ 930పీని నేషనల్ హైవేస్ నిర్మాణ శాఖ నిర్మిస్తోందన్నారు. ఈ రోడ్డును ఆ శాఖ నిరుడే పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కానీ నిర్మాణ పనులకు పలు అనుమతులు రాకపోవడంతో ఇంకా పనులు ప్రారంభం కాలేదన్నారు. గత వర్షాకాలంలో రోడ్డు అక్కడక్కడా గుంతలు పడి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో గత వారం హైదరాబాద్లో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డిని, జాతీయ రహదారుల నిర్మాణ ఈఎన్సీ గణపతిరెడ్డిని కలిశామన్నారు. రోడ్డుపై గుంతలు, ప్రయాణికుల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో మంత్రి స్పందించి ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోనే ఎన్హెచ్ 930పీపై గుంతల మరమ్మతులకు రూ.41 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వెంటనే టెండర్ పిలిచినట్లు చెప్పారు. అలాగే ఇల్లెందు నియోజకవర్గం కోసం మంత్రి కేటీఆర్ వివిధ శాఖల ద్వారా రూ.22 కోట్లు మంజూరు చేయించారన్నారు. అలాగే, టేకులపల్లి మండలంలో రూ.7.50 కోట్లతో మినీ స్టేడియం, గ్రంథాలయం, ఫంక్షన్ హాల్, బస్టాండ్, బోడు రోడ్డు సెంటర్ నుంచి దాస్తండా వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. తడికలపూడి క్రాస్ రోడ్డు నుంచి తడికలపూడి వరకు 7 కిలోమీటర్ల మేర రూ.14 కోట్ల సింగరేణి నిధులతో ఆర్అండ్బీ అధికారులు రహదారిని నిర్మిస్తారన్నారు. ఇల్లెందు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు సింగరేణి ద్వారా సీఎం కేసీఆర్ సహకారంతో సీఎండీ 20 ఎకరాల భూమి కేటాయించినట్లు చెప్పారు. ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, టీఆర్ఎస్ నాయకులు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, బోడ బాలునాయక్, జటోత్ నరేశ్, బర్మవత్ శివకృష్ణ, ఇస్లావత్ నామానాయక్, బానోత్ రవికుమార్, మూడ్ బాలు, గుగులోత్ కిషన్నాయక్, చందర్ పాల్గొన్నారు.