యాదాద్రి, నవంబర్ 21 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తజనుల కోలాహలం నెలకొంది. కార్తికమాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభువులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. ఆలయ పురవీధులు, ప్రసాద విక్రయశాలలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీవారి ధర్మదర్శనానికి 2గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలకు అనుమతించలేదు. స్వామి వారి పాదాల నుంచి పాతగోశాల వద్ద గల పార్కింగ్కు దారి మళ్లించారు. కార్తికమాసం సందర్భంగా తెల్లవారు జామూన 3గంటలకు నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, సుప్రభాతం నిర్వహించిన అర్చకులు నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి సుదర్శన నారసింహ హోమంతో శ్రీవారిని కొలిచారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట నారసింహుడి ఆలయంలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ.27,16, 328 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న ఎస్పీఎఫ్ డీజీ
యాదాద్రి నారసింహ స్వామిని ఎస్పీఎఫ్ డీజీ ఉమేశ్ శరఫ్ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం అందిచారు.
స్వర్ణతాపడానికి రూ.50,01,116 విరాళం
ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి జలవిహార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు ఎన్వీ.రామరాజు రూ.50,01, 116 ఆర్టీజీఎస్ ఆన్లైన్ ద్వారా గత నెల 25న అందజేసినట్లు ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు.