తల్లిదండ్రులు కోల్పోయిన బాలలకు ప్రభుత్వం అండ
జిల్లాలో 180 మంది బాలబాలికల గుర్తింపు
యాదాద్రి, నవంబర్ 21 : కరోనా బాధితుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పథకాలను వర్తింపజేస్తూ దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. కుటుంబంలో ఇంటి యజమాని(భర్త లేక భార్య) చనిపోతే ఆ కుటుంబం అస్తవ్యస్తంగా మారుతున్నది. ఇలాంటి పరిస్థితిని గమనించిన ప్రభుత్వాలు కొవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు చేయూత నిస్తూ అండగా నిలుస్తున్నాయి. వారి చదువుకు కావాల్సిన నిధులు సమకూర్చి మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. జిల్లాలో కరోనా కారణంగా 2020-21 సంవత్సరంలో 12 మంది పూర్తిగా, 168 మంది బాలలు పాక్షిక అనాథలుగా మారారు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలను మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా బాలల సంక్షేమ సమితి ముందు హాజరు పరిచి BAAL SWARAJ Portal , PM Cares లలో నమోదు చేసి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 12 మంది బాలలను పూర్తి అనాథలుగా గుర్తించి పీఎం కేర్స్ ఫండ్(ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్) ద్వారా రాష్ట్రం 30 శాతం, కేంద్ర ప్రభుత్వం 70 శాతం వాటాతో వారికి 23 యేండ్లు నిండిన తర్వాత ఒక్కొక్కరికి రూ.10 లక్షలు వచ్చే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. పాక్షిక అనాథలకు రూ. 50 చొప్పున ఎక్స్గ్రేషియా వచ్చే చర్యలు తీసుకుంది.
కరోనా సమయంలో..
అనాథ, పాక్షిక అనాథ బాలలకు పోషణ నిమిత్తం కరోనా సమయంలో రూ.2లక్షల నిత్యావసర సరుకులను అందజేశారు. వీరి పర్యవేక్షణకు నోడల్ అధికారులుగా అంగన్వాడీ సూపర్వైజర్లు, బాలల పరిరక్షణ విభా గం సిబ్బందిని నియమించింది. స్పాన్సర్ షిప్ పథకం కింద 12 మంది అనాథ బాలలకు ఫోన్లు, నెలకు రూ.2 వేల చొప్పున నగదు పంపిణీ చేపట్టారు. 12 మంది చిన్నారుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న ముగ్గురు బాలలకు ప్రభుత్వం నుంచి రూ. 50 వేల ఆయా విద్యా సంస్థలకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఇందులో మరో 16 మంది బాలలను 3 శాతం రిజర్వేషన్ ద్వారా స్థానిక గురుకుల పాఠశాలలో చేర్పించారు. ఇటీవల ప్రప ంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 90 మంది కరోనా బాధిత బాలలను 3 బస్సుల్లో పర్యాటక ప్రాంతలైన భువనగిరి ఖిల్లా, కొలనుపాక జైన్ మందిరం, సోమేశ్వరాలయం సందర్శనకు తీసుకెళ్లారు. ఉచితంగా నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులను అందజేశారు.
దాతల సహకారంతో..
బాస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 120 కుటుంబాలకు రూ.1.5 లక్షల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 139 కుటుంబాలకు 2.10 లక్షల విలువ కల్గిన నిత్యావసర సరుకులను అందజేశారు. జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థలు రూ.2 లక్షల మెడికల్ కిట్లను ప్రభుత్వం ద్వారా పంపిణీ చేశాయి. యాదగిరిగుట్టలో తండ్రిని కోల్పోయి విద్యకు దూరమైన నూకల నరేందర్కు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ ట్రెజరరీ అధికారి కర్నాటి విజయకుమార్ ఆర్థికసాయం అందజేశారు.