యాదగిరిగుట్ట పీహెచ్సీ పరిధిలో మొదటి డోసు పూర్తి
వంద శాతం పూర్తవడంతో హర్షాతిరేకాలు
యాదగిరిగుట్ట రూరల్, నవంబర్ 21 : కరోనా కట్టడికి కొవిడ్ టీకా వేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు యాదరిగుట్ట పీహెచ్సీ పరిధిలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వంద శాతం విజయవంతంగా పూర్తయ్యింది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు.
సమన్వయంతో ముందుకు
యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఆశ, అంగన్వాడీ సిబ్బంది ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ వ్యాక్సినేషన్ చేపట్టారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకాలు వేశారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలు, ఆవాస గ్రామాలు కలుపుకొని మొత్తం 29,812 మందికి మొదటి డోసు వేసినట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పీహెచ్సీ సిబ్బంది, వైద్యుడు రోజువారీ సమీక్షలు నిర్వహించుకుంటూ ఆ నివేదికలను ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ముందుకు సాగారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, యువతను సమన్వయం చేసుకుంటూ వంద శాతం వ్యాక్సినేషన్ వేయించారు. వంద శాతం వ్యాక్సిన్ పూర్తయినందుకు మహబూబ్పేట ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పీహెచ్సీ, అంగన్వాడీ సిబ్బందిని, ఆశ వర్కర్ను సన్మానించారు.
ప్రభుత్వ ఆదేశానుసారం ముందుకెళ్లాం
కొవిడ్ టీకాను ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ మొదటి డోసును వంద శాతం పూర్తి చేశాం. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందితో నిత్యం గ్రామాలకు వెళ్లి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజలకు కొవిడ్ టీకా గురించి వివరించాం.
-వంశీకృష్ణ, వైద్యుడు, యాదగిరిగుట్ట పీహెచ్సీ