ఆలేరు టౌన్, నవంబర్ 20 : ప్రత్యేక అవసరాల పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో చిన్నారులకు ఫిజియో ధెరపీతో పాటు విద్య, వైద్యం అందించేవారు. ఫలితంగా పిల్లలు తమ లోపాలను కొంత వరకు అధిగమించి ఇతరులతో కలిసి జీవించేందుకు అవకాశం ఏర్పడుతున్నది. కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు కేవలం టెలీ సేవలు అందించగా .. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో గత నెల నుంచి ప్రత్యక్ష సేవలను ప్రారంభించారు.
బాధితుల గుర్తింపు
చిన్ననాటి నుంచే సరైన పోషకాహారం లభించకపోవడం, జన్యు లోపాలతో పాటు పోలియో, పక్షవాతం, వినికిడి లోపం, ఎముకల బలహీనత, బుద్ధిమాంద్యం, బహుళ వైకల్యం వంటి 21 రకాల వైకల్యాలతో పలువురు చిన్నారులు బాధపడుతున్నారు. వీరికి అవసరమైన విద్య, వైద్యం అందించేందుకు భవిత కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రతి మండల కేంద్రంలో ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేయగా..విద్యాశాఖ, సమగ్ర శిక్షా కేంద్రం పర్యవేక్షణలో ఇవి పని చేస్తున్నాయి. ఆయా కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు అందిస్తారు. మధ్యాహ్న భోజనం అందిస్తారు. వీరికి నెలకు రూ. 350 రవాణా భత్యం చెల్లిస్తారు. ప్రతి సోమవారం ఫిజియోథెరఫీ, బుధవారం స్పీచ్ థెరఫీ నిర్వహిస్తారు. అంధులకు బ్రెయిలీ లిపి, లైఫ్ స్కిల్స్, బుద్ధిమాంధ్యం ఉన్న పిల్లలకు రోజువారి దినచర్యలు, విద్య, భాషా నైపుణ్యం, ప్రవర్తనపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. శారీరక నిస్సహాయతతో భవిత కేంద్రాలకు రాలేని పిల్లలు ఉంటే ఐఈఆర్పీలు ఇంటికి వెళ్లి సేవలు అందిస్తారు.
జిల్లాలో 15 కేంద్రాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 15 భవిత కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 19 ఏండ్ల లోపు దివ్యాంగ పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల సమగ్ర శిక్షా అభియాన్ నిర్వహించిన సర్వేలో రిసోర్స్ పర్సన్లు జిల్లాలో అంగవైకల్యంతో చదువు మధ్యలో మానేజీ ఇంటివద్దే ఉంటున్న వారిని గుర్తించారు. వైకల్యం తీరు తీవ్రతతో పాటు ఇతర సమాచారాన్ని సేకరించారు. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రాల్లో చేర్పించి ఆరోగ్యం పరిరక్షణతో పాటు, చదువు నేర్పిస్తున్నారు.