కొండాపూర్, నవంబర్ 19 : పాలిథీన్ కవర్ల వినియోగంతో పర్యావరణానికి కలుగుతున్న ముప్పును తగ్గించేందుకు జోగుళాంబ గద్వాల జిల్లా చింతలకుంట ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి శ్రీజ రూపొందించిన పర్యావరణహిత బయోడిగ్రేడబుల్ పాట్స్ని శుక్రవారం హైటెక్సిటీ ఐటీ కారిడార్లోని జీఈ ఐప్లెన్స్ సంస్థలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), టీ-వర్క్స్ సం యుక్త ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. విద్యార్థిని శ్రీజ ఆలోచనలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ‘ఇంటిం టా ఇన్నోవేటర్’ ప్రోగ్రామ్ ద్వారా ఎంపిక చేసి టీ-వర్క్స్ సహకారంతో అద్భుత ఆవిష్కరణను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ చైర్మన్ డాక్టర్ శాంత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇన్నోవేటివ్గా ఆలోచించే యువత, చిన్నారులు, ఉద్యోగులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థిని శ్రీజ ఆలోచన గ్లోబల్ సమస్యకు సొల్యూషన్గా ఉందని, పాలిథీన్ కవర్లతో తలెత్తే పర్యావరణ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. బయోడిగ్రేడబుల్ పాట్స్ తయారీలో టీ-వర్క్స్ కృషి ఎంతో ఉందన్నారు. వృథాగా పారేసే వేరుశనగ పొట్టుతో బయోడిగ్రేడబుల్ పాట్స్ తయా రీ ఆలోచనను మ్యాథ్స్ సార్ ఆగస్టన్ ప్రోత్సాహంతో రూపొందించినట్లు శ్రీజ తెలిపింది. టీఎస్ఐసీ, టీ-వర్క్స్ తోడ్పాటుతోనే పాట్స్ తయారీ సాధ్యమైందన్నారు. చేతులతో రోజుకు పది పాట్స్ మాత్రమే తయారు చేయగలిగే స్థితి నుంచి టీ-వర్క్స్ అందజేసిన యంత్రాల సహాయం తో నేడు అవసరమైన స్థాయిలో తయారు చేయగలమన్నా రు. తెలంగాణకు హరితహారంలో బయోడిగ్రేడబుల్ పాట్స్ వినియోగంపై ప్రభుత్వం ఆలోచించాలని శ్రీజ తెలిపింది. దీంతో పాటుగా జీఈ ఐప్లెన్స్ అందజేసిన పరికరాలతో చింతలకుంటలో పాట్స్ తయారీ ఇండస్ట్రీని ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పిస్తానని పేర్కొంది. కార్యక్రమంలో టీ-వర్క్స్ ప్రతినిధులు, జీఈ ఐప్లెన్స్ సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.