మరికల్, నవంబర్ 19: సాగు చట్టాల రద్దు రైతు విజయమని నారాయణపేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజవర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలని నిరసనలు తెలుపగా కేంద్రం దిగివచ్చి సాగు చట్టాలను రద్దు చేసిందన్నారు. రైతులు పండించిన వడ్లను కొనేవరకు టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతు రాజ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, నారాయణ పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డి పోరాడుతారన్నారు. దేశంలో బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ కస్పే గోవర్ధన్, టీఆర్ఎస్ మండలకమిటీ అధ్యక్షుడు తిరుపతయ్య, కార్యదర్శి కృష్ణారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు మతీన్, నాయకులు శ్రీనివాసులు, హన్మిరెడ్డి, రాయుడు, గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల బాధలు తెలుసుకోవాలి
మక్తల్ టౌన్, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో విజయమని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్ అన్నారు. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్ మాట్లాడుతూ ఇది రైతుల విజయమని, దేశ రైతులకు ప్రధానమంత్రి మోడీ క్షమాపణలు చెప్పడం సంతోషించ దగ్గ విషయమన్నారు. ఢిల్లీలో చలిలో ఉద్యమం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అసువులు బాసిన రైతులకు నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ గొప్ప కాదని, రైతాంగం తలుచుకుంటే ఎవరైనా దిగి రావాల్సిందే అని తెలిపారు. బీజేపీ నాయకులు రైతులతో రాజకీయాలు మానుకోవాలని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నా, తెలంగాణ రైతాంగం నిరసనలు కేంద్రం పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవిశంకర్రెడ్డి, అధికార ప్రతినిధి రామలింగం, కౌన్సిలర్ రాములు, అన్వర్, విష్ణువర్ధన్రెడ్డి, శంశొద్దీన్, మజర్, వెంకట్రెడ్డి, వెంకటేశ్ గౌడ్, సాగర్, ఆనంద్,మలేశ్, అంజప్ప, మహమూద్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లచట్టాల రద్దు హర్షణీయం
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి నల్ల చట్టాలను రద్దు చేయడం రైతుల విజయమని ఏఐకేఎమ్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భగవంతు ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం మక్తల్ పట్టణంలో పీడీఎస్యూ, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్ నాయుకులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చాలాకాలంగా రైతులు పోరాటం సాగిస్తుండటంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా దేశ రైతాంగానికి మోడీ క్షమాపణలు కోరుతూ ప్రకటనలు చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర నాయకుడు బి భాస్కర్, ఎఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భగవంతు, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏజీ భుట్టో, ఈశ్వర్ పాల్గొన్నారు.