కలెక్టర్ వల్లూరి క్రాంతి
గద్వాల రూరల్, నవంబర్19 : అపోహ వీడి ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని ముల్కలపల్లి, తుర్కొనిపల్లి,సంగాల గ్రామాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ముల్కలపల్లి గ్రామంలో స్వయంగా ప్రజలతో ఆమె మాట్లాడారు. అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. గ్రామాల్లో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాలన్నారు. గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేటట్లు చూడాలన్నారు. అదే విధంగా ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఓపీ రిజిస్టర్ పరిశీలించి కొవిడ్ పోర్టల్లో నమోదు అయిన వారి వివరాలు తెలుసుకున్నారు. పీహెచ్సీల్లో గర్భిణులు కాన్పు అయ్యేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చందూనాయక్, డాక్టర్ జయరాజ్, ఎంపీవో చెన్నయ్య, సర్పంచ్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి పరశురాము నాయుడు, ఖజామీర్, రోజారాణి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉప్పేరు పీహెచ్సీ పరిశీలన
ధరూర్, నవంబర్ 19 : వ్యాక్సిన్పై అపోహ వీడి వ్యాక్సినేషన్ వేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. శుక్రవారం మండలంలోని ఉప్పేరు పీహెచ్సీని పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి వ్యాక్సిన్ వేసుకున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో వందశాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా ఆరోగ్య కార్యకర్తలు చూడాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చందూనాయక్, డాక్టర్ జయరాజ్, పంచాయతి కార్యదర్శులు , ఏఎన్ఎంలు, ఆశలు, ప్రజలు ఉన్నారు.
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
గద్వాల న్యూటౌన్, నవంబర్ 19 : వైన్షాప్ల డ్రా ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న జరిగే వైన్షాప్ లాటరీల ఏర్పాటుకు నిర్వహించిన హరిత హోటల్లో అబ్కారి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రా ఏర్పాట్లను ఆమె శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఉదయం 11గంటల కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెం డెంట్ సైదులు, ఎక్సైజ్ సీఐలు బానోతు పటేల్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.