ఏటా మూడింతల ఆదాయం
ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
జిల్లావ్యాప్తంగా 794 చెరువుల్లో పెంపకం
చేపల తరలింపునకు 70శాతం సబ్సిడీపై వాహనాల పంపిణీ
కొత్తగా రొయ్యల పెంపకానికి శ్రీకారం
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 19 : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నది. కొన్నేండ్లుగా మత్స్యకారుల ఇండ్లు మత్స్య సంపదతో వెలుగొందుతున్నాయి. ఏటా పెట్టిన పెట్టుబడికి మూడింతల ఆదాయం వస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ఏడాదికి 3 వేల టన్నుల చేపల దిగుబడి వస్తుండగా.. రూ.30 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నది. మొదట 70 చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రారంభించగా, క్రమంగా చెరువుల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 794 చెరువుల్లో పెంచుతున్నారు. చేపలను విక్రయానికి తరలించేందుకు ప్రభుత్వం 70 శాతం సబ్సిడీపై వాహనాలను కూడా అందజేసింది. జిల్లాలో 108 మత్స్యకారుల సొసైటీలుండగా, వీటిలో 14 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. మొత్తం 6616 మంది సభ్యులున్నారు. చేపల పెంపకం ఫలించడంతో ప్రభుత్వం తాజాగా రొయ్యల పెంపకానికి శ్రీకారం చుట్టింది. మొదటగా జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాల పెద్ద చెరువులో రొయ్యలు పెంచుతున్నారు.
జిల్లాలోని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. అయితే గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెలను పంపిణీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకం కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పించడంతో చేపల పెంపకాన్ని వదిలి ఏదో ఒక కూలీ పని చేస్తూ బతుకునీడుస్తున్న వారి కుటుంబాల్లో సీఎం కేసీఆర్ తిరిగి వెలుగులు నింపారు. ఇందులో భాగంగానే గత ఐదేండ్లుగా మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులు సక్సెస్ కావడం, చెరువుల్లో నీరు నిండడంతో చేపల పెంపకానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు విడుతల్లో చేపల పెంపకం పూర్తి కావడంతో సంబంధిత చేపలను విక్రయించిన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. వారి ఆర్థిక స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చేపల పెంపకం కార్యక్రమంతో జిల్లాలోని ప్రతి మత్స్యకారుడి కుటుంబం ఆర్థికంగా బలోపేతమైంది. జిల్లాలో సుమారు 800 చెరువుల్లో చేపల పెంపకం జరుగుతున్నది.
ఏటా 3 వేల టన్నుల దిగుబడి
చేపల పెంపకంతో ప్రతి ఏటా మత్య్సకారులు అధిక మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేసి మత్స్యకారులకు స్వయం ఉపాధి కల్పించడంతో ఆర్థికంగా వృద్ధి చెందారు. చేపల పెంపకంతో ప్రతి ఏటా జిల్లా నుంచి 3 వేల టన్నుల చేపల దిగుబడి వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో సరాసరి రూ.30కోట్ల వరకు ఆదాయం రాబడుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొదట కేవలం 70 చెరువుల్లోనే చేపల పెంపకాన్ని ప్రారంభించగా, తదనంతరం 300 చెరువులు, 580 చెరువులు, ఈ ఏడాది 794 చెరువుల్లో చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేయడంతోపాటు చేపలను విక్రయించడంలోనూ మత్స్యకారులు నష్టపోకుండా కూడా చర్యలు చేపట్టింది. జిల్లాలో పెంచిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్తో పాటు స్థానికంగా విక్రయిస్తూ లాభాలను పొందుతున్నారు.
రవాణా ఖర్చులు కూడా పెద్దగా లేకపోవడం, పెట్టుబడి ఖర్చు లేకపోవడంతో మత్స్యకారులు అధిక లాభాలను పొందుతున్నారు. చేపలను విక్రయించేందుకు 70 శాతం సబ్సిడీతో వాహనాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకారులకు అందజేసింది. వందశాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేపలను మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో పెంచుతున్నారు. గతంలో కొన్ని చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిరుత్సాహంతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది.
చెరువుల్లో నీరు లేకపోవడంతో కొందరు మత్స్యకారులు వలసలు పోగా, మరికొందరు ఇతర పనులు చేస్తుండేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు పూర్తైన చెరువుల్లో చేప పిల్లలను పెంచే ప్రక్రియ జరుగుతున్నది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేపల పెంపకం జరుగుతున్నది. ఎలాంటి అక్రమాలు జరుగకుండా గ్రామ కార్యదర్శి తదితరులతో కూడిన గ్రామస్థాయిలో కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. జిల్లాలో 108 మత్స్యకారుల సొసైటీలకు.. 14 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలున్నాయి. సంబంధిత మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 6616 మంది సభ్యులున్నారు.
మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు