షాబాద్, జనవరి 19 : జిల్లాలోని షాబాద్ పహిల్వాన్షావలి దర్గా ఉర్సు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఉర్సు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 20న గంధం కార్యక్రమం ఉంటుంది. రాత్రి పది గంటలకు మల్కీబావి సమీపంలో ఉన్న దర్గా నుంచి గంధం భారీగా ఊరేగింపు జరుగుతుంది. 21న చిరాగాన్(దీపారాధన) కవ్వాలీ, 22న మీనాబజార్ ఉంటుంది.
దర్గా చరిత్ర..
షాబాద్ ప్రాంతంలో పహిల్వాన్షావలి సజీవ సమాధి కావడంతో ఈ దర్గాకు పహిల్వాన్షావలి దర్గాగా పేరు వచ్చినట్లు మత పెద్దలు పేర్కొంటున్నారు. సుమారు 412 ఏండ్ల చరిత్ర ఈ దర్గా సొంతం. ఆ కాలంలో షాబాద్ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. నిజం వంశానికి చెందిన మాలిక్షా కుష్టువ్యాధిగ్రస్తుడై మనస్తాపంతో అడవులపాలయ్యాడని, అడవిలో తిరుగుతూ షాబాద్ ప్రాంతంలోని ప్రస్తుత చెరువు గట్టుపైన పహిల్వాన్షావలి దర్గా సమీపంలోని రావి వృక్షం కింద సేద తీరుతుండగా, మాలిక్షాకు స్వప్నంలోకి దివ్యస్వరూపుడు ఒకరు వచ్చి సమీపంలోని మల్కీబావిలో నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్న ప్రస్తుత పహిల్వాన్షావలి దర్గా వద్ద రావిచెట్టు కింద ప్రార్థన చేయాలని సూచించాడు. దీంతో మాలిక్షా అదే విధంగా చేసి వ్యాధి నుంచి విముక్తి పొంది నిజాం వారసత్వంలో ఉన్నత స్థానాన్ని పొందాడు. వెంటనే మాలిక్షా షాబాద్ గ్రామంలో దర్గా నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మత పెద్దలు పేర్కొంటున్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలోని అన్ని మతాల ప్రజలు సమైక్యంగా ప్రార్థనలు నిర్వహిస్తూ పహిల్వాన్షావలి అనుగ్రహం పొందుతున్నారు. ఈ ఉత్సవాల్లో మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
దర్గా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి..
వారం రోజుల పాటు సాగే షాబాద్ పహిల్వాన్ షావలి ఉర్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ దర్గాకు రంగులు వేసి అందమైన విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. షాబాద్ పహిల్వాన్ షావలి దర్గా ఉత్సవాలకు షాద్నగర్, అప్జల్గంజ్, మొహీదీపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర డిపోలకు చెందిన బస్సులు నడిపించనున్నారు.