పిల్లిపల్లిలో ఆవుదూడపై పంజా విసిరిన చిరుత
తాడిపర్తి, ముద్విన్ అటవీ ప్రాంతంలో సంచారం
మూగజీవాలపై వరుస దాడులు
భయాందోళనలో రైతులు
చిరుతను బంధించడానికి అధికారుల యత్నం
యాచారం, జనవరి 17 : మండలంలో ఓ చిరుత జోరుగా సంచరిస్తూ తీవ్ర కలకలం రేపుతున్నది. మూగజీవాలపై విచ్చలవిడిగా విరుచుకుపడి దాడులకు పాల్పడుతున్నది. మొన్న నానక్నగర్లో, నిన్న సాయిరెడ్డిగూడలో, నేడు పిల్లిపల్లిలో సంచరించి ఓ మేకను, రెండు ఆవుదూడలను పొట్టనబెట్టుకుంది. కొన్ని రోజులుగా మండల పరిధిలోని తాడిపర్తితోపాటు శివారులోని ముద్విన్ అటవీ ప్రాంతంలోనూ సంచరిస్తూ నాలుగైదు గ్రామాలలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు, రైతులకు గుబులు పుట్టిస్తున్నది. చిరుత ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో గతంలో పదుల సంఖ్యలో మేకలను, ఆవులు, దూడలు, గేదెలు, పెంపుడు కుక్కలను చంపిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా మండలంలో కనుమరుగైన చిరుత తిరిగి మళ్లీ తిరిగి సంచరించడంతో తాడిపర్తి, పిల్లిపల్లి, నానక్నగర్, మేడిపల్లి, నందివనపర్తి గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లాలన్నా, తిరిగి ఇంటికి రావాలన్నా జంకుతున్నారు. చిరుత బారి నుంచి తమల్ని రక్షించాలని అటవీశాఖ అధికారులతో రైతులు మొరపెట్టుకున్నారు. ప్రజల ఆవేదన మేరకు చిరుతను బంధించడానికి అటవీ అధికారులు యత్నిస్తున్నారు. నానక్నగర్లో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లో చిరుత చిక్కిన విషయం తెలిసిందే. దానిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కందుకూరు రేంజ్ ఆఫీసర్ నిఖిల్కుమార్రెడ్డి తెలిపారు.
తాజాగా పిల్లిపల్లిలో ఆవుదూడపై దాడి
మండలంలోని నందివనపర్తి గ్రామానికి అనుబంధంగా ఉన్న పిల్లిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి చిరుత సంచరించింది. గ్రామానికి చెందిన ఎరుకల భిక్షపతిగౌడ్ తన పొలం వద్ద కట్టేసిన ఆవుదూడను చంపింది. సోమవారం పొద్దుగాల పొలంకాడికి వెళ్లి చూసిన రైతు తన ఆవుదూడ మరణించి ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అది చిరుతపనేనని నిర్ధారించారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ కోరారు. చిరుత కదలికలను బట్టి బోను ఏర్పాటు చేసి బంధించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 9న నానక్నగర్ గ్రామంలో తాండ్ర రామచంద్రయ్య పొలంలో సంచరించిన చిరుత మేకను ఎత్తుకెళ్లి గుట్టపై బండచరియలో చంపి తిన్న విషయం తెలిసిందే. ఇటీవలే కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామంలోనూ చిరుత ఆవుదూడను చంపుకుతిన్నది. తాజాగా పిల్లిపల్లిలో దూడను చంపడంతో రైతులు జంకుతున్నారు.
గతంలోనూ తీవ్ర కలకలం
మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కాస కృష్ణయ్యకు చెందిన బర్రె దూడను, కాస జంగయ్యకు చెందిన నాలుగు మేక పిల్లలను, యాదిరెడ్డికి చెందిన రెండు పెంపుడు కుక్కలను చిరుత ఎత్తుకెళ్లి చంపి తిన్నది. ఐలయ్యకు చెందిన మేకల మందపై దాడిచేసి నాలుగు మేకలను గాయపరిచి, మరో మేకను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. తాడిపర్తి గ్రామానికి చెందిన కడారి రాములుకు చెందిన నాలుగు మేకలను తీవ్రంగా గాయపర్చి, మరో మేకను ఈడ్చుకెళ్లి చెట్ల పొదల్లో చంపి తినేసింది. బండారి కృష్ణయ్య, బండారి రాములుకు చెందిన రెండు ఆవుదూడలను చంపేసింది. కుర్మిద్ద గ్రామానికి చెందిన ఆవుల నారయ్య గొర్రెను, ఆవుదూడను చిరుత మాటేసి మట్టుబెట్టింది. మేడిపల్లిలో ముంత మైసయ్యకు చెందిన రెండు ఆవులను, మేకను వరుస దాడులతో చంపేసింది. నందివనపర్తిలో అనంతం అనే రైతుకు చెందిన ఆవును, యాదయ్య అనే రైతుకు చెందిన ఆవును చిరుత మట్టుబెట్టింది. మంథన్గౌరెల్లిలోనూ సంచరించిన చిరుత గిరిజనులకు చెందిన మేకలను పొట్టన బెట్టుకుంది. తాడిపర్తి, నానక్నగర్, మేడిపల్లి, నందివనపర్తి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి గ్రామాలతో పాటు శివారు ప్రాంతాలైన కడ్తాల మండలం చరికొండ, నాగిళ్ల, పల్లెచెల్కతండా, ముద్విన్, ఎక్వాయపల్లి, గోవిందపల్లి, మైసిగండి, నెరెళ్లుకోల్తండా, కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ, ఆమనగల్లు మండలం మంగల్పల్లి, చంద్రయాణపల్లి గ్రామాల్లో చిరుత సంచరించి ఎన్నో మూగ జీవాలను చంపుకుతిన్నది. పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసి కుక్కపిల్లలు, మేక పిల్లలను ఎరవేసినా తప్పించుకు తిరిగిన చిరుతను పట్టుకోవడంలో విఫలమయ్యారు. చివరకు చేసేదేమీలేక 30 నుంచి 40 జింక పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలేశారు. వాటిని వేటాడుతూ గ్రామాల శివారులోకి రాకుండాపోతాయనేది అధికారుల నమ్మకం. వారి ప్రయత్నం ఫలించి కొన్ని నెలలుగా ఇటువైపు చిరుతపులి సంచరించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం చిరుత తిరిగి మళ్లీ సంచరిస్తూ మేకలు, ఆవు దూడలపై వరుస దాడులకు పాల్పడుతూ రైతులకు నిద్రలేకుండా చేస్తున్నది. చిరుతను వెంటనే బంధించాలని రైతులు, గొర్రెల మేకల పెంపకందారులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చిరుతను పట్టుకునేంత వరకు రైతులు జాగ్రత్తగా ఉండాలని, తమ పశువులను ఇండ్ల వద్ద ఉంచుకోవాలని, రాత్రిపూట పొలాల వద్ద ఉంచొద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.