వికారాబాద్, తాండూరు దవాఖానల్లో ఊయలలు ఏర్పాటు
మాతా శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో దత్తతపై అవగాహన కార్యక్రమాలు
ఆస్పత్రుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సిబ్బంది
పరిగి, జనవరి 17 : పుట్టిన పిల్లలను దవాఖానలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో కాకుండా దవాఖానల్లో వదిలి వెళ్లడానికి, ‘ఊయల’లు ఏర్పాటు చేశారు. అలాంటి పిల్లలను మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా స్వాధీనం చేసుకొని వారిని ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న శిశుగృహలో ఉంచుతారు. పిల్లలకు కావాల్సిన సదుపాయాలు ఈ శాఖ ద్వారా కల్పిస్తారు. కొన్ని నెలల తర్వాత పిల్లల తల్లిదండ్రుల గురించి విచారణ చేస్తారు. పిల్లల తల్లిదండ్రుల సమాచారం లేకపోతే కేంద్ర దత్తత ఏజెన్సీ ద్వారా సంతానంలేని తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారికి సీనియారిటీ ప్రాతిపదికన దత్తత ఇస్తారు. పిల్లలు అధికంగా ఉండి పోషించే స్తోమతలేనివారు తమ పిల్లలను మహిళా, శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించవచ్చు. అక్రమ దత్తతలను అరికట్టడంతోపాటు పిల్లలను పెంచలేని పరిస్థితిలో ఉన్నవారు ఎక్కడపడితే అక్కడ వదిలి వెళ్లకుండా తమకప్పగిస్తే అన్నీ పరిశీలించి చట్టబద్ధంగా దత్తతకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ‘ఊయల’ కార్యక్రమం అమలు చేస్తున్నారు. సంతానలేమితో ఇబ్బంది పడుతున్న దంపతులు అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరం. తాము పిల్లలను దత్తత తీసుకోదలిస్తే శిశుగృహలో సంప్రదించాలి. ఆన్లైన్లో దత్తతకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే రెండు సంవత్సరాల కాలంలో వారి ఆరోగ్య, ఆర్థిక, ఇతర అన్ని పరిస్థితులు పరిశీలించి అర్హులైతే వారికి పిల్లలను దత్తత ఇస్తారు.
అవగాహన కార్యక్రమాలు
దత్తతపై డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శిశువులను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా, వదిలివెళ్లకుండా ‘ఊయల’లో పడుకోబెట్టి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్, తాండూరు దవాఖానల్లో ఊయలలు ఏర్పాటు చేశారు. మిగతా దవాఖానల్లో ఈ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా చిన్నారులను వదలిపెట్టి వెళ్లడం కంటే ఈ ఊయలలో పడుకోబెట్టి వెళ్లడం ద్వారా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారి ఆలనాపాలనా చూడడంతోపాటు విద్యాభ్యాసానికి సహకారం అందుతుంది. అలాగే దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైనవారికి సీనియారిటీ ప్రకారం దత్తత ఇస్తారు. ఇప్పటివరకు వికారాబాద్ జిల్లా పరిధిలో 33 మంది పిల్లలను దత్తత ఇచ్చారు. చట్టబద్దమైన దత్తతపై ప్రతిఒక్కరికి అవగాహన పెంపొందించేందుకు కృషి జరుగుతున్నది.
అనాథలుగా మిగలరాదని..
పలువురు శిశువులను రోడ్డు పక్కన పారవేస్తున్నారు. గతంలో వికారాబాద్లోని శిశుగృహ సమీపంలో ఓ శిశువును పారవేశారు. రైల్వేస్టేషన్లో ఒక అమ్మాయిని వదిలిపెట్టి వెళ్లారు. పిల్లలకు జన్మనివ్వడం వరకే తప్ప వారిని పెంచి పోషించకుండా రోడ్డు పక్కన పారవేసే అమానవీయ సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇలాంటివాటిని నివారించేందుకు దవాఖానల్లో ‘ఊయల’ ఏర్పాటు చేశారు. ఎక్కడో పారవేయకుండా ఈ ఊయలలో పడుకోబెట్టి వెళ్లాలని మాతా, శిశు సంరక్షణ అధికారులు సూచిస్తున్నారు. అధిక సంతానం ఉన్నప్పుడు శిశువులను దవాఖానల్లో ఉంచిన ఉయ్యాలలో పడుకోబెట్టి, తమ పూర్తి వివరాలు అందించాలి. అలాంటివారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఇలాంటి శిశువులను దత్తత కావాలని కోరుకునే దంపతులకు సంబంధించిన పూర్తి వివరాల పరిశీలన తర్వాతే చట్టబద్దంగా దత్తత ఇస్తారు. దీర్ఘకాలిక, హానికరమైన, ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు, మానసిక, శారీరక అంగవైకల్యం, ఆర్థిక స్థిరత్వం లేనివారికి దత్తత ఇవ్వబడదు. పూర్తిస్థాయిలో ధ్రువపత్రాలు సేకరించిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఏఆర్ఏ.ఎన్ఐసీ.ఐఎన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. పాప లేదా బాబును దత్తత తీసుకునే రోజున రూ.40,000 డీడీ సంబంధిత ఏజెన్సీకి చెల్లించాలి.
దత్తతపై అవగాహన : టి.శ్రీలక్ష్మి, బాలరక్ష భవన్, వికారాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్
పిల్లలను పెంచలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు మాతా శిశు సంరక్షణ శాఖ అధికారులను, వికారాబాద్లోని శిశు గృహను సంప్రదించాలి. అలాంటివారు చైల్డ్లైన్ హెల్ప్ నెంబర్ 1098 ద్వారా సైతం సంప్రదించవచ్చు. లేకపోతే ఆ ప్రాంతంలోని ఐసీడీఎస్ కార్యాలయాన్నిగాని సంప్రదించాలి. అలాంటి పిల్లలను పిల్లల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు చట్టబద్దంగా దత్తత ఇస్తారు. చట్టబద్దమైన దత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.