రూ.70 లక్షల విలువైన గంజాయి పట్టివేత
రూ.2.10 లక్షల నగదు, 3 కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
పోలీసుల అదుపులో ఐదుగురు.. పరారీలో మరో ఐదుగురు
ముఠాపై పథకం ప్రకారమే దాడి
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి
కొత్తూరు/కొత్తూరు రూరల్, జనవరి 17 : గంజాయిని తరలిస్తున్న ముఠాపై పథకం ప్రకారమే దాడి చేసినట్లు శంషాబాద్ డీసీపీ పి.జగదీశ్వర్రెడ్డి తెలిపారు. కొత్తూరులోని ఠాణాలో సీఐ భూపాల్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి శంషాబాద్ డీసీపీ పి.జగదీశ్వర్రెడ్డి హాజరై కేసు వివరాలను తెలియజేశారు. డీసీపీ జగదీశ్వర్రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన రవి, సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలానికి చెందిన నాగరాజు, తొర్రూరుకు చెందిన బాలరాజు, ఉప్పల్కు చెందిన గణేశ్, సంగారెడ్డికి చెందిన రాథోడ్ రవి, సూర్యాపేట జిల్లా, గారెడిపల్లి మండలం, చిన్నగారకుంట తండాకు చెందిన మాలోత్ వినోద్ ఈజీ మనీకి అలవాటుపడ్డారన్నారు. దీంతో రాష్ట్రంలో గంజాయిని అమ్మితే అధికంగా లాభాలు, ఈజీగా డబ్బులను సంపాదించవచ్చనే ఉద్దేశంతో రవి, నాగరాజు, బాలరాజు, గణేశ్, రాథోడ్ రవి, మాలోత్ వినోద్ పథకం వేశారు. అటవీ ప్రాంతంలో పండించే గంజాయిని తక్కువ ధరకు కొనుగోలుచేసి అధికంగా అమ్ముడుపోయే హైదరాబాద్, ఇతర రాష్ర్టాలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో గంజాయి ముఠా సభ్యులు మహారాష్ట్ర రాష్ట్రం, అహ్మద్నగర్ జిల్లా, కౌట గ్రామానికి చెందిన బాబాసౌ చందేకర్, పుక్మాలి తిరుమలి బాలు, అహ్మద్నగర్ జిల్లా, సంగామెర్ తాలుకా, శ్రీరాంపూర్కు చెందిన గణేశ్ నొలారి, నెవెస జిల్లా, చంద తాలుకా, గదెగావ్ గ్రామానికి చెందిన రాజేంద్రతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్నట్లుగానే ముఠా సభ్యులు 214 కిలోలు గల 107 ప్యాకెట్ల గంజాయిని ఓక్స్ వ్యాగన్ కారులో తరలించేందుకు పథకం వేశారు.
ఈ నేపథ్యంలో కొత్తూరు మండలపరిధిలోని తిమ్మాపూర్ చౌరస్తా వద్ద మాలోత్ వినోద్ తన ఓక్స్ వ్యాగన్ కారులో నుంచి 107 ప్యాకెట్ల గంజాయిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు మారుతి, హోండా కార్లలోకి మార్చే క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు, కొత్తూరు పోలీసులు ఎంతో చాకచక్యంగా స్మగ్లింగ్ ముఠాపై దాడి నిర్వహించి మాలోత్ వినోద్, బాబాసౌ చందేకర్, పుక్మాలి తిరుమలి బాలు, గణేశ్ నొలారి, రాజేంద్రను అరెస్ట్చేశారు. నిందితుల నుంచి 214 కిలోల గంజాయి, 3 కార్లు, రూ.2.10లక్షలు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు ముఠా సభ్యులు రవి, నాగరాజు, బాలరాజు, గణేశ్, రాథోడ్ రవి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
పోలీసులను అభినందించిన డీసీపీ
ఎంతో చాకచక్యకంగా గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న శంషాబాద్ ఎస్వోటీ సీఐ వెంకట్రెడ్డి బృందం, కొత్తూరు సీఐ శ్రీధర్భూపాల్ బృందాన్ని ఆయన అభినందించారు. ఇంత పెద్దమొత్తంలో గంజాయి పట్టుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్, గంజాయికి బానిస కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. యువతను బానిసలుగా మార్చుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో షాద్నగర్ ఏసీపీ కుశల్కర్, సీఐ భూపాల్శ్రీధర్, ఎస్వోటీ సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐ రవి, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.