మే 1నుంచి విస్తృత పంపిణీ
ఏర్పాట్లు చేస్తున్న వైద్యారోగ్య శాఖ
కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు
పట్టణాల్లో శానిటైజేషన్ ముమ్మరం
30వరకు రాత్రి కర్ఫ్యూ
నాగర్కర్నూల్, ఏప్రిల్ 22, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం పీహెచ్సీల ద్వారా 45ఏండ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొదట్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు వెనుకంజ వేశారు. అయితే ఇటీవల పెరుగుతున్న కేసులతో జనాల్లో కలిగిన అవగాహనతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు దవాఖానల వద్దకు బారులు తీరుతున్నారు. ఇలా ఓ వైపు వ్యాక్సిన్ కొనసాగుతున్నా కరోనా కేసులు రెట్టింపు కావడంతో 18ఏండ్లు దాటిన వారికీ వ్యాక్సిన్ వేయించేలా కేంద్రం నిర్ణయించింది. దీంతో మే 1వ తేదీ నుంచి వయోజనులకూ టీకా వేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఫ్రంట్లైన్ వర్కర్లు, 45ఏండ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగానే టీకా కొనసాగనున్నది. జనాభాలో 60శాతం మందికి టీకా వేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కాగా దవాఖానలతోపాటుగా కలెక్టరేట్ తదితర ప్రాంతాల్లో కరోనా పరీక్షలు సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇక గతంలో మాదిరిగానే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించేలా ఆదేశాలు ఇస్తున్నారు.
మాస్కులు ధరించకుంటే రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో శానిటైజేషన్ ముమ్మరం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశంతో పట్టణాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నివాసాలు, జన సంచార ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ శానిటైజేషన్ చేయిస్తున్నారు. కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గ్రామాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. జలుబులాంటి చిన్న చిన్న లక్షణాలున్నా దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని తెలియజేస్తున్నారు. ఇక కర్ఫ్యూతో రాత్రి 9గంటల తర్వాత అత్యవసరముంటేనే ప్రజలు బయటకు రావాల్సి ఉంటుంది. ప్రజల్లో కూడా అవగాహన పెరుగడంతోపాటు మండుటెండలతో ప్రధాన రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా ప్రజల
నుంచి ఆదరణ పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా టీకాలు అందించేందుకు వైద్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో ఇలా..
నాగర్కర్నూల్ జిల్లాలో ఏడాది నుంచి 13వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం 2500వరకు యాక్టివ్ కేసులున్నాయి. గత నెలలో ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా జిల్లాలో మొదటి డోసుగా 40వేలకుపైగా టీకాలు వేశారు. రెండో డోసు కింద 5వేల టీకాలు వేయడం పూర్తయ్యింది. ఇటీవల ప్రజల్లో పెరిగిన అవగాహనతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నారు. కాగా మే 1నుంచి 18ఏండ్లు దాటిన వారికీ టీకా వేయనుండడంతో ఈ సంఖ్య భారీగా పెరుగనున్నది.