హైదరాబాద్ నుంచి ఖమ్మం తరలిస్తూ పట్టుబడిన నిందితులు
కూసుమంచి, మే 16: మండల పరిధిలోని నాయకన్గూడెంలో ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు రెమ్డెసివర్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టాస్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం నారాపల్లి గ్రామానికి చెందిన నల్లెదా తిరుమల్రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఓ దుకాణంలో ఐదు రెమ్డెసివర్ ఇంజెక్షన్లు తీసుకున్నాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్వోగా పనిచేస్తున్న ఆకారపు నిరంజన్తో కలిసి ఖమ్మం తరలిస్తుండగా నాయకన్గూడెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఇంజెక్షన్ను రూ.32 వేలకు విక్రయించేందుకు తీసుకువెళ్తుండగా పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ రామానుజం తెలిపారు. హైదరాబాద్లోని మెడికల్ షాపు యజమానిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.
అక్రమార్కులపై నిఘా..
ఖమ్మం సీపీ విష్ణు వారియర్ రెమ్డెసివర్ ఇంజెక్షన్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితుల అనారోగ్యాన్ని సోమ్ము చేసుకోవడంపై సీపీ సీరియస్గా తీసుకున్నారని టాస్క్ఫోర్స్ ఏసీపీ రామానుజం తెలిపారు. పట్టుబడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.