బొంరాస్పేట, జనవరి 16 : గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను పెంచి దట్టమైన అటవీ ప్రాంతాలుగా మార్చడంతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం బృహత్ ప్రకృతి వనాలను, మినీ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీలో ఎకరం నుంచి అర ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటిలో మొక్కలు నాటించి పచ్చదనం పెంపొందిస్తున్నది. తాజాగా ప్రతి మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పది ఎకరాల విస్తీర్ణంలో, మండలానికి నాలుగు మినీ పల్లె ప్రకృతి వనాలను ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ఏర్పాటుతో గ్రామాల్లో అటవీ ప్రాంతం పెరుగడంతో పాటు గ్రామీణ ప్రజలకు కూడా పట్టణాల్లో మాదిరిగా ఆహ్లాదాన్ని కలిగించే పార్కులుగా ఇవి రూపుదిద్దుకోనున్నాయి. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి పనులు కూడా చేపట్టారు. మొక్కలు నాటడం, పిల్లలు ఆడుకోవడానికి మైదానం , వాకింగ్ ట్రాక్ పనులు చేపడుతున్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనానికి రూ.40 లక్షలు, మినీ పల్లె ప్రకృతి వనాలకు రూ.20 లక్షల వరకు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేస్తారు. జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు వీటి పనులను తరుచూ పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేయడానికి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు.
బొంరాస్పేట మండలంలోని దుద్యాల గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేసి మొక్కలు నాటే పనులు ప్రారంభించారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో 40 వేల మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటికే 31 వేల మొక్కలు నాటారు. 50 శాతం పనులు పూర్తి చేశారు. అదేవిధంగా మండలంలోని మదన్పల్లి, చిల్ముల్మైలారం, ఏర్పుమళ్ల, జానకంపల్లి గ్రామాల్లో మినీ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మదన్పల్లి, చిల్ముల్మైలారం మినీ ప్రకృతి వనంలో 15 వేల చొప్పున మొక్కలు నాటాల్సి ఉండగా ఏడు వేల చొప్పున మొక్కలు నాటారు. జానకంపల్లి, ఏర్పుమళ్లలో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఏర్పుమళ్లలో భూమి చదును చేసే పనులు పూర్తయ్యాయి. జానకంపల్లిలో స్థలం ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. పలు గ్రామాల్లోని నర్సరీల లో పెంచిన మొక్కలు తెచ్చి వీటిలో నాటుతున్నారు. నాటిన మొక్కలను కూడా సంరక్షించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోసి కాపాడటానికి వాచర్ను నియమిస్తున్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, మినీ పల్లె ప్రకృతి వనాలు పూర్తయితే గ్రామాల్లో దట్టమైన అటవీ ప్రాంతం వృద్ధిచెందడంతో పాటు చల్లదనం, ఆహ్లాదాన్ని పెంచే పార్కులుగా మారుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.