మంచాల, జనవరి 16 : మంచాల మండలంలోని జాపాల, మంచాల గ్రామాలకు వెళ్లే రోడ్డు మూలమలుపులతో పాటు గుంతల మయంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు అధ్వానంగా ఉండటంతో పాటు మూలమలుపుల వద్ద ఏపుగా పెరిగిన చెట్లతో ఎదురుగా వచే వాహనాలు కనిపించక పోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంచాల, జాపాల ప్రధాన రహదారి కావడంతో ఎన్నో ఏండ్ల క్రితం వేసిన బీటీ రోడ్డు కొట్టుకుపోయి గుంతలమయంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై వాహనదారులు ప్రయాణం చేయాలంటేనే అరచేతిలో ప్రాణం పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల రోజుల్లో ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరి కొందరు క్షతగాత్రులుగా మారారు. మంచాల నుంచి జాపాల, ఆగపల్లి, లోయపల్లి, బోడకొండ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం వందలాది మంది వివిధ పనుల నిమిత్తం మండల పరిషత్ కార్యాలయానికి వస్తూ వెళ్తూంటారు. అయితే రోడ్డు అస్తవ్యస్తంగా మారడంతో ఈ రోడ్డుపై వాహనాలు నడపాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయడమే కాకుండా మాలమలుపుల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, కంప చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
మూలమలుపు కనిపించక నలుగురి మృతి
మంచాల నుంచి జాపాలకు వచ్చే రోడ్డు ప్రమాద కరమైన మూలమలుపులు, గతుకుల రోడ్డు. నెల రోజుల్లో జాపాలకు చెందిన జంగయ్య, యాచారానికి చెందిన జగన్, చాంద్ఖాన్గూడకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా కనిపించని పరిస్థితి.