కొనుగోలు కేంద్రాల వద్ద దౌర్జన్యం
కండ్ల ముందే ధాన్యం రాశులు చెల్లాచెదురు
అడ్డుకున్న రైతులపై కర్రలు, రాళ్లతో దాడి
అన్నదాతల నిలదీతతో ఉక్కిరిబిక్కిరైన బీజేపీ నేతలు
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ);అన్నదాతపై బీజేపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. రాళ్లు, రౌడీషీటర్లతో తెగబడ్డారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చెల్లాచెదురు చేస్తూ అరాచకం చేశారు. పలుకరింపు ముసుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై వాలిన బండి ముఠా.. రైతులు నిలదీయడంతో తట్టుకోలేకపోయింది. యాసంగి ధాన్యం కొనలేమంటూ.. సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడమెందుకని అన్నదాతలు ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరై.. అసహనంతో దాడులకు దిగింది. మీడియా, పోలీసులు, అన్నదాతకు అండగా నిలిచిన టీఆర్ఎస్ నాయకులపైనా రాళ్లు రువ్వి రక్తం కండ్ల చూసింది. ఆగ్రహానికి గురైన రైతాంగం నల్లగొండ నుంచి సూర్యాపేట వరకూ అడుగడుగునా బండి బ్యాచ్ను అడ్డుకున్నది. నల్లజెండాలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తించింది. అంతిమంగా పాచిక పారని సంజయ్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సోమవారం తోకముడవక తప్పని పరిస్థితిని ఏర్పడింది.
సజావుగా సాగుతున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పర్యటనపై జిల్లా రైతాంగం తిరగబడింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కొర్రీలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తామంటే ఊరుకునేది లేదంటూ రైతులు ఎదురుతిరిగారు. సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాగిన బండి పర్యటనలో అడుగడుగునా నిరసనల హోరు కనిపించింది. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పర్యటన వద్దంటూ అడ్డగించారు. నల్లజెండాలు, చెప్పులతో బండి గో బ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. ధాన్యం కొంటారా.. కొనరా అని ప్రశ్నించిన రైతులు, టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
ఆర్జాలబావి వద్ద అలజడి
నల్లగొండ, నీలగిరి, నల్లగొండ రూరల్, నవంబర్ 15 : నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలోని ఆర్జాల బావిలో ప్రతి సీజన్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 1.20 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తారు. రోజూ పది లారీలకు పైగా ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తారు. 17శాతం తేమ ఉంటేనే ధాన్యం సేకరణ జరుగుతుంది. కానీ అవేమీ పట్టించుకోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ నుంచి బీజేపీ కార్యకర్తలతో కార్లలో వచ్చి ఇక్కడ రచ్చ రచ్చ చేశారు. కేంద్రం ధాన్యాన్ని కొంటామని చెప్పినా రాష్ట్రమే కొనడం లేదని రైతులకు తప్పుగా చెప్పారు. దీంతో రైతులు మిల్లుల్లోని ధాన్యం ఎఫ్సీఐ ఎందుకు తీసుకోవడం లేదని కొందరు రైతులు ప్రశ్నించారు. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని సీఎంఆర్ రూపంలో తీసుకొని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. గోబ్యాక్ సంజయ్ అని నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు బండికి చెప్పులు చూపించి కోడి గుడ్లు విసరడంతో బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో రైతులు ఆ దాడికి వణుకుతూ టెంకలు పెట్టుకోగా ఒకరిద్దరికి గాయాలయ్యాయి. వెంటనే బండి సంజయ్ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు.
రాళ్లదాడితో చెల్లాచెదురైన ధాన్యం కుప్పలు
కొనుగోలు కేంద్రంలో కుప్పగా పోసిన ధాన్యం బీజేపీ కార్యకర్తల రాళ్లదాడి చెల్లాచెదురైంది. ఆ ధాన్యాన్ని మళ్లీ కుప్ప పోసేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. నేలపై, పట్టాల కింద ధాన్యం పడిపోవడంతో కొంత మేర నష్టం జరిగింది.
అడుగడుగునా గొడవలు సృష్టించిన బీజేపీ
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 15 : ధాన్యం కేంద్రాలను సందర్శించడానికి వచ్చిన బీజేపీ నేత బండి సంజయ్ను రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నారు. నల్లగొండ నుంచి మిర్యాలగూడకు వచ్చిన ఆయనను రాస్తారోకో చేసి గోబ్యాక్ సంజయ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో మిర్యాలగూడ శివారులోని మహతేజ రైస్మిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ కార్యకర్తల దాడిలో బుగ్గబాయిగూడేనికి చెందిన మోదుగు సైదిరెడ్డి గాయపడ్డాడు. దీంతో టీఆర్ఎస్ అద్దంకి-నార్కట్పల్లి ప్రధాన రహదారిపై రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. నిరసన తెలిపిన వారిలో టీఆర్ఎస్ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ, తిరునగరు భార్గవ్, కుర్ర విష్ణు, ధీరావత్ స్కైలాబ్, ధీరావత్ రవితేజ, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్, షోయబ్, దినేశ్, దుర్గంపూడి నారాయణరెడ్డి ఉన్నారు.
కేంద్రం ధాన్యం ఎందుకు కొనదు..?
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనడంలేదు. ధాన్యం కొననని కేద్ర ప్రభుత్వం ఒక వైపు చెబుతుండగా, రాష్ట్రంలో బీజీపీ నాయకులు మాత్రం ధాన్యం కొనుగోలుచేస్తుండగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంబయ్ మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కు మద్దతు ధర ఇవ్వడంనే దని విమర్శిస్తున్న సంజయ్ నీకు కేంద్రం పై నమ్మకం ఉంటే దానిని మెప్పించి దొడ్డు ధాన్యం కొనేమే విధంగా అనుమతి తీసుకు రా…రైతులలపై ప్రేమే ఉంటే గతంలో మాదిరిగా రైతుల ధాన్యం కొనుగోలు చేసే విధంతా అనుమతి తీసుకురా..అప్పడు మాత్రమే మీ పాలపై రైతులకు నమ్మకం ఏర్పడుతుంది. కేంద్రం చెపేది ఒక మాటయితే..రాష్ట్ర బీజేపీ నాయకులు ఒక మాట చెబుతున్నారు. దీనితో రైతులు అయోమయంలో పడిపోతున్నారు. కేంద్రంపై వత్తిడి తెచ్చి మద్దవతు ధరకు రైతులను నుంచి ధాన్యం కొనుగోలు చేసినటటట్లయితే ఈ బాధలే రైతులకు ఉండవు. ఇప్పటి కైన సంబయ్ కేంద్రాన్ని ఒప్పించు.దొడ్డు ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూడాలి.
-మండల వెంకన్న, బొమ్మకల్, మాడ్గులపల్లి మండలం
జిల్లాలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
నల్లగొండ, నవంబర్ 15 : ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిచ్చు పెట్టేందుకే బీజేపీ కుట్ర చేస్తున్నదని, దమ్ముంటే కేంద్రం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని అనుమతి ఇప్పిస్తారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్ సోమవారం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు రైతులపై రాళ్ల దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. బీజేపీ కుట్రలు తెలిసిన రైతాంగం ఆయన్ను నిలదీస్తే ఆ పార్టీ గూండాలతో రైతులపై రాళ్ల దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. గడిచిన ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే కేంద్రం ఈ సారి ఉద్దేశ పూర్వకంగానే రాష్ట్ర కుట్రలు పన్ని రైతులపై దాడికి ప్రయత్నం చేయిస్తున్నదని విమర్శించారు. కరోనా సమయంలోనూ ధాన్యం కొనుగోలు చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో, అందులో నల్లగొండలో అధిగ దిగుబడి వచ్చిందని, ఇది తట్టుకోలేని బీజేపీ కుయుక్తులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వాదన అర్థరహితం
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
యాదాద్రి, నవంబర్15 : రాష్ట్రంలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితులను ఆర్థం చేసుకోకుండా అర్థరహితంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యూహాత్మకంగా ఒక వర్గం సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరిని బియ్యంగా మార్చే నిష్పత్తి (ఓటీఆర్)ని సాధారణ రకానికి 67 శాతం, బాయిల్డ్ రైస్కు 68 శాతంగా కేంద్ర ప్రభుత్వం రెండున్నర దశాబ్దాల క్రితం గోకర్ కమిటీ సిఫార్సులపై నిర్ధారించిందని పేర్కొన్నారు. వాటినే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, ఓటీఆర్ను కనిష్ఠంగా, గరిష్ఠంగా నిర్ధారించడం కేంద్ర చేతిలోనే ఉందని తెలిపారు. దశాబ్దాలుగా యాసంగి సీజన్లో 90 నుంచి 95 శాతం వరకు సీఎంఆర్ కింద బాయిల్డ్ రైస్ను ఎఫ్సీఐకి అప్పగిస్తున్నామని, యాసంగిలో రాష్ట్రం అధిక ఉష్ణోగ్రత వల్ల రా రైస్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండదని, ధాన్యాన్ని రారైస్గా మారిస్తే 30 నుంచి 40 శాతం వరకు నూకలు వస్తాయని, దీనికి ఎఫ్సీఐ అనుమతించదని తెలిపారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితులను ప్రధానమంత్రిగారికి వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేసి రైతాంగంపై తమ అభిమానాన్ని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు.