ప్రత్యామ్నాయ పంటల వైపు రైతన్నదృష్టి
కూరగాయల సాగుకు రైతన్న ఆసక్తి
లాభాల సిరులు.. కాయగూరలు
వరికి బదులు గోధుమ, బాస్మతి పంట
అధిక రాబడి సాధిస్తున్న రైతులు
మూసాపేట, నవంబర్ 14: యాసంగిలో ఆరుతడి పంటల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నది. దీంతో కర్షకులు కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. మూసాపేట, అడ్డాకుల మండలాల్లో పలువురు గోధుమ, బాస్మతి వరి, కాయగూరల సాగు చేశారు. అధిక రాబడి వస్తుండడంతో మిగితా రైతులు ఈ పంటలు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
మూస ధోరణికి స్వస్తి పలికి.. ఆధునిక పోకడలపై రైతాంగం మెల్లగా దృష్టి సారిస్తున్నది. యావత్ ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతుండడంతో అన్నదాతలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యాపారాలు స్థానిక ప్రజా అవసరాలు, వినియోగ సామర్థ్యం బట్టి ఉత్పత్తిని మార్పు చేసిన వారే అధిక లాభాలు సాధిస్తారు. ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం, నిపుణులు కూడా అందరూ ఒకే రకం పంటలు కాకుండా వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలు సాగుచేస్తే లాభాలు సాధించవచ్చని చెబుతున్నారు. రైతులు ఒక్కొక్కరుగా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా కూరగాయాలు, ఇతర పంటల సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతులపై ప్రత్యేక కథనం..
వరికి బదులుగా గోధుమ వేశాను
అందరూ ఒకే రకం వరి పంటనే సాగుచేయడం వల్ల అమ్మడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతోపాటు ప్రతి రోజు మనం తినడానికి డబ్బులు పెట్టి గోధుమలు కొనాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరికి బదులుగా మాకున్న భూమిలో ఎకరంలో యాసంగిలో గోధుమ పంటను సాగుచేశాను. గోధుమలు మాలో ఎవరూ సాగు చేయరు. పంటదిగుబడి వచ్చిందంటే చాలు మా కుటుంబం తినడానికి వాడుకోవడంతో పాటు, గోధుమలు అందరికీ నిత్యావసరం. అందుకని మిగిలిన ధాన్యం గ్రామంలోనే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. అమ్మడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరో ఎకరాలో బాస్మతి వరి పంట సాగుచేశాను. అవికూడా మా కుటుంబం అవసరానికి తినడంతో పాటు, గ్రామంలోనే అమ్ముడు పోతాయి.
మూస పద్ధతులను వీడాలి
నా పేరు బొక్కలపల్లి తిరుపతిరెడ్డి. మాది అడ్డాకుల గ్రామం. నేను గతంలో వరి ఇతర పంటలు సాగుచేశాను. కానీ నాకు తెలిసిన ఒక రైతు కూరగాయలు సాగుచేస్తున్నాడని తెలిసి అతని పొలం వద్దకు వెళ్లి చూశాను. కూరగాయల సాగువిధానం పరిశీలించా. లాభాలను అడిగి తెలుసుకొని నేను కూరగాయాల సాగు ఎందుకు చేయకూడదని ఆలోచించాను. నాకున్న 2.05 ఎకరాల్లో పందిరి వేయించి దొండకాయ పందిరి సాగు వేయించాను. పందిరి నీడలో ఖాళీ స్థలంలో టమోట, బజ్జి మిర్చి, బెండకాయ, వంకాయ తోటలను సాగుచేశాను. పందిరి చుట్టూ మునగచెట్లను నాటించాను. అందుకు నాకు మొత్తం రూ. 4.80 లక్షలు ఖర్చు చేశాను. ప్రభుత్వం నుంచి రూ.1.20లక్షల సబ్సిడీ వచ్చింది. పందిరిపై దొండకాయతో పాటు అదే స్థలంలో ఇతర కూరగాయలు సాగుచేయడంతో స్థలంతో పాటు, సాగునీటి ఖర్చు కూడా తగ్గిపోతుంది. లాభాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం నేను రోజుకు 2క్వింటాళ్ల దొండకాయలు కిలో రూ.35 చొప్పున అమ్ముతున్నాను. 25 నుంచి 50కిలోల వరకు టమోట, బజ్జి మిర్చి 30 నుంచి 50కేజీలు, బెండ, వంకాయలు కలిసి 60కేజీల వరకు అమ్ముతున్నాను. ప్రతి రోజు రూ.8 వేల నుంచి 10వేల వరకు ఆదాయం వస్తుంది. నేను పందిరి కోసం ఒకేసారి పెట్టుబడి పెట్టాను. ఆ పెట్టుబడి నాకు ఎప్పుడో వచ్చేసింది. ప్రతి రోజు లాభాలు తీసుకుంటున్నాను. నాకు అంగవైకల్యం ఉంది. అయినా సరే కూలీలను పెట్టి సాగుచేస్తున్నాను. వారంతపు సంతలతో పాటు, పాలమూరు, జడ్చర్ల, కొత్తకోటలకు చెందిన కూరగాయల వ్యాపారులు నేరుగా వచ్చి తీసుకుంటున్నారు. మంచి లాభాలు వస్తున్నాయి. సన్న,చిన్నకారు రైతులు మూస పద్ధతులను విడనాడి కూరగాయల సాగును ఎంచుకోవాలి.