ఉమ్మడి జిల్లాలో నిరాడంబరంగా ఈదుల్ ఫిత్
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు
తెలంగాణలోనే మైనార్టీలకు అభ్యున్నతి: మంత్రి
ఖమ్మం, మే 14: రంజాన్ పర్వదినాన్ని ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ‘ఈదుల్ ఫిత్’్ర వేడుకలను నిరాడంబరంగా జరిగాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కల్లూరు, వైరా తదితర పట్టణాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లోని మసీదులకు అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. వారు కూడా భౌతికదూరం పాటిస్తూ ప్రత్యేక నమాజులు ఆచరించారు. 30 రోజులుగా కఠోర ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లింలు రంజాన్ నెల వంక కనిపించిన అనంతరం దీక్షలు విరమించారు. సర్వమానవాళిని సుఖసంతోషాలతో ఉంచాలని అల్లాహ్ను ప్రార్థించారు. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలంటూ ప్రత్యేక నమాజులు ఆచరించారు. సర్వ మానవాళిని సత్యమార్గంలో నడిపించాలని కోరారు. నమాజు అనంతరం కొవిడ్ నిబంధనల నడుమ నాలుగు మీటర్ల దూరంలో ఉండి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. కాగా ఖమ్మంలోని తన స్వగృహంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొద్దిమంది ముస్లింలతో కలిసి ప్రత్యేక నమాజులు ఆచరించారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు వారు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.
తెలంగాణలోనే మైనార్టీలకు అభ్యున్నతి
తెలంగాణ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభ్యున్నతి సాధ్యమైనందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ముస్లింలు ఆత్మగౌరవంతో జీవించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు బాటలు వేశారని గుర్తుచేశారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ముస్లింలకు శుక్రవారం ఈద్-ఉల్-ఫీతర్ శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నగరంలోని మమత ఆసుప్రతి ప్రాంగణంలో గల మంత్రి నివాసంలో కొద్ది మంది ముస్లిం పెద్దలతో కలిసి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలను నిర్వహించారు. శుక్రవారం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల రోజుల పాటు అత్యంత నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తూ సకల జనుల బాగు కోసం అల్లాహ్ను ప్రార్థించిన ముస్లింలందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సుడా డైరెక్టర్ ముక్తార్ షేక్, కార్పొరేటర్ మక్బూల్, మాజీ కార్పొరేటర్లు షౌకత్అలీ, నాగుల్మీరా, టీఆర్ఎస్ నాయకులు తాజుద్దీన్, మజీద్, మస్తాన్, ఖయ్యూం, అకీం, ఖాసీం పాల్గొన్నారు.