గ్రామాల్లో విరివిగా నాటుకోళ్ల పెంపకం
స్వయం ఉపాధిగా ఎంచుకుంటున్న గ్రామీణ యువత
సంక్రాంతి పండుగ పూట భారీ డిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 14: నాటు కోడి పెంపకందారులకు లాభాల పంట పడిస్తున్నది. సహజసిద్ధంగా పెరుగడం.. పుష్కలమైన పోషకాలు ఉండటంతో వాటి మాంసానికి భలే గిరాకీ ఉంటున్నది. ముఖ్యంగా సెలవు దినాలు, పండుగ వేళల్లో మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తున్నది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్ ఫుల్లుగా ఉంటుంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మాంసంప్రియులు మటన్కు బదులుగా నాటుకోడి కూరను తినేందుకు అధికంగా ఆసక్తి చూపుతుంటారు. గ్రామాల్లోని కొందరు నిరుద్యోగులు నాటుకోళ్ల పెంపకాన్ని ఉపాధి మార్గం గా ఎంచుకుంటున్నారు. బాయిలర్ కోళ్ల పెంపకంతో పోల్చితే శ్రమ తక్కువ, మందులు సైతం అంతగా వాడాల్సిన అవసరం లేదు. సహజసిద్ధంగా ఇండ్ల మధ్యన, పెరట్లల్లో వీటిని పెంచొచ్చును. అయితే, ఇటీవల కాలంలో చాలామం ది షెడ్లలోనూ నాటుకోళ్లను పెంచుతున్నారు. కొవిడ్ వైరస్ను తట్టుకునేందుకు ఎక్కువమంది ప్రజలు చికెన్ను ఆరగిస్తున్నారు. మామూలు రోజుల్లో ఒక్క కోడిపెట్ట రూ.300, కోడిపుంజు రూ.400ల వరకు ధర పలుకుతుంది. కానీ సం క్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో నాటుకోళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్క కోడిపెట్ట రూ.500, పుంజు 700ల వరకు వాటిని విక్రయిస్తున్నారు.
ఆరోగ్యానికి మంచిది..
బాయిలర్ కోళ్లతో పోల్చితే నాటుకోడి మాంసం ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మకం. ఎందుకంటే ఈ కోళ్లు సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటాయి. మేక, గొర్రెల మాంసంలో కొ వ్వు ఎక్కువగా ఉండటంతో అధిక శాతం మం ది ప్రజలు నాటు కోళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
భలే క్రేజీ..
ఒకప్పుడు గ్రామీణులు ఇండ్లల్లో నాటుకోళ్లను పెంచుకునేవారు. బంధువులొచ్చినా, పండుగలొచ్చినా ఇంటిలో పెంచుకున్న నాటుకోడి కూర వండేవారు. మారిన జీవనశైలితోపాటు కోళ్ల పెంపకం, వాసన తదితర ఇబ్బందులను గమనించిన పల్లెప్రజలు వీటి పెంపకాన్ని తగ్గించా రు. ఈ క్రమంలో బ్రాయిలర్ కోళ్లు రావడం, గ్రామాల్లో చికెన్ సెంటర్లు ఏర్పాటు కావడంతో ప్రజలు ఈ చికెన్కే మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా బాయిలర్ చికెన్ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరికే అవకాశం ఉండటంతో ప్రజలు నాటుకోడిని మరిచిపోయారు. కొవిడ్ వైరస్ ప్రభావంతో ప్ర జలు నాటుకోడి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రోటీన్లు ఉండే తిండి తిని ఇమ్యూనిటీ పెంచుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో నాటుకోడి మాంసానికి గిరాకీ పెరిగింది.