ఆర్థిక భరోసా అందుకుంటున్న అంగన్వాడీలు
డిసెంబర్ జీతంలో పెరిగిన పీఆర్సీ కూడా..
ఉమ్మడి జిల్లాలో 8,005 మందికి లబ్ధి
జీఓ విడుదలపై హర్షాతిరేకాలు
నీలగిరి, డిసెంబర్ 13 : సమస్యల పరిష్కారానికి పోరాడితే గుర్రాలతో తొక్కించిన సమైక్య పాలకులను చూసిన అంగన్వాడీలు.. స్వరాష్ట్రంలో సగర్వంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొచ్చిన తమకు సీఎం కేసీఆర్ ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు పెంచుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ మేరకు 30 శాతం అదనపు వేతనం డిసెంబర్ నెల జీతంతోపాటే ఖాతాలకు చేరుతుందని తాజాగా ప్రభుత్వం ప్రకటించడం అంగన్వాడీల్లో సంతోషం నింపుతున్నది. ఉమ్మడి జిల్లాలో 8,005 మంది అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు లబ్ధి చేకూరనున్నది.
గత ప్రభుత్వాల హయాంలో చాలీచాలనీ వేతనాలతో ఇబ్బంది పడిన అంగన్వాడీలకు స్వరాష్ట్రంలో ఆర్థిక భరోసా కలుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటికే రెండు సార్లు వేతనాలు పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం..మరోసారి శుభవార్త చెప్పింది. మూడో సారి వేతనాలు పెంచాలని నిర్ణయించిన సర్కార్.. ఈ నెల నుంచే అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్న అంగన్వాడీల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చాలీచాలనీ వేతనాలతో పూట గడువని పరిస్థితులతో ఇబ్బంది పడుతూ కాలం వెళ్లదీసిన అంగన్వాడీ సిబ్బందిని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే గుర్తించారు. వారి వేతనాలు పెంచి వెతలను తీర్చారు. ముచ్చటగా మూడోసారి జీతాలు పెంచి గౌరవం పెంచారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2015 మే లో తొలిసారి అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.4,200 నుంచి రూ.7వేలకు పెంచింది. 2017 మార్చిలో 10,500 రూపాయలు చేసింది. తాజాగా ఆగస్టులో మూడో సారి 30 శాతం పీఆర్సీ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో అంగన్వాడీలకు రూ.13,650 పెరుగనుంది. మినీ అంగన్వాడీ ఆయాలకు 2015కు ముందు రూ.2,200 వేతనం ఉండగా 2015 మేలో రూ.4,500, 2017 మార్చిలో రూ.6 వేలు, తాజాగా రూ.7,800కు పెరిగింది. పెంచిన వేతనాలు ఈ నెల నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 8,005 మందికి లబ్ధి చేకూరనుంది.
ఉమ్మడి జిల్లాలో 4,202 అంగన్వాడీ కేంద్రాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,202 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 3,802 ప్రధాన, 401 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 4,203 మంది అంగన్వాడీ టీచర్లు, 3,802 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఆగస్టు నెలలోనే వీరి వేతనాలు పెంచుతూ జీఓ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెల వేతనంతో కలిపి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రూ. 10,500 వేతనం ఉండగా రూ.13,650, మినీ అంగన్వాడీ హెల్పర్లకు రూ.6 వేలు ఉండగా రూ.7,800లకు పెంచారు.
ఈ నెల వేతనంతో కలిపి..
సీఎం కేసీఆర్ పెంచిన 30 శాతం పీఆర్సీ వేతనాలను డిసెంబర్ నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 8005 మంది అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు లబ్ధి చేకూరనున్నది. నల్లగొండ జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టుల్లో 1,831 అంగన్వాడీల్లో 3662 మంది టీచర్లు, ఆయాలు ఉన్నారు. 261 మంది మినీ అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో ఐదు ప్రాజెక్టుల్లో 1,126 అంగన్వాడీల్లో 2,252 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉన్నారు. 83 మంది మినీ అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల్లో 844 అంగన్వాడీ కేంద్రాల్లో 1,688 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉండగా, 57 మినీ అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
సీమాంధ్ర పాలకులు ఇచ్చే వేతనాలతో ఇండు ్లగడవక అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో అంగన్వాడీ పాత్రను చూడడంతో పాటు వారి కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వేతనాలను ఏడేండ్లలో మూడుదఫాలుగా రూ.4,200 నుంచి 13,650లకు పెంచారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
మరిన్ని సేవలు అందించేందుకు కృషి
అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచడం ఆనందంగా ఉంది. వేతనాలు పెంచడంతో మా బాధ్యత మరింత పెరిగింది. విద్యార్థులకు తగిన విధంగా చదువు చెప్పడంతోపాటు బాలింతలు, గర్భిణులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తాం. ప్రస్తుతం పెంచిన వేతనంతో మరింత గౌరవం పెరిగింది. గౌరవంతోపాటు మాపై మరింత బాధ్యతను కూడా పెంచారు.