నేడు ప్రపంచ మధుమేహ దినం
జిల్లాలో పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య
ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణం
సరైన జాగ్రత్తలతో దూరం
ఆలేరు టౌన్, నవంబర్ 13 : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో చిన్నా,పెద్ద తేడా లేకుండా మధు మేహ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి సాంఘిక, ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయగలదు. మధుమేహ బాధితుల్లో 80 శాతానికి పైగా ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా నియంత్రించవచ్చని వైద్యాధికారులు సూచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నూటికి 18 మంది పురుషులు, మహిళలు 14.06 షుగర్ వ్యాధి బారిన పడ్డారని, వీరంతా 15 ఏండ్ల పైబడిన వారు ఉన్నట్లు గతేడాది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదికలో వెల్లడైంది. ఈ సర్వే కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ, భారతీయ ప్రభుత్వం ముంబయికి చెందిన సంస్థ చేసింది. వైద్యారోగ్య లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 19 వేల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అంతే కా కుండా మనిషి మరణానికి కారణమవుతున్న వ్యాధుల క్రమపద్ధతిలో మధుమేహం ఏడో స్థానంలో ఉంది. ప్రాథమిక స్థాయిలో ఈ వ్యాధిని గుర్తించకపోవడం వల్ల అనేక అనర్థాలకు దారి తీస్తుంది. యువతలోనూ చక్కెర లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో పట్టణాలు, పల్లెలు.. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఒకప్పుడు 60 ఏండ్లు దాటిన వారిలో షుగర్ లక్షణాలు కనబడేవి. నేడు చిన్న వయస్సులోనే బయట పడుతున్నాయి. పుట్టిన బిడ్డలోనూ కనిపిస్తున్న చక్కెర వ్యాధి లక్షణాలు కలవరానికి గురి చేస్తున్నాయి.
మధుమేహ వ్యాధి అంటే..
మానవుడి జీర్ణ వ్యవస్థలో గ్లూకోజ్ (చక్కెర)ను నియంత్రించే ఇన్సులిన్ (క్లోమం) హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేయకపోయినా రక్తంలో చక్కెర అసాధారణంగా పెరిగిపోతున్నది. వైద్య భాషలో దీన్ని డయాబెటిస్ మెల్లిటస్ అంటా రు. ఈ కారణంగా దీనిని ఆ పేరుతో పిలుస్తారు.
లక్షణాలివే..
అతిగా మూత్రం రావడం, దాహం, ఆకలి, గాయాలు మానకపోవడం, చర్మవ్యాధులు రావడం, బరువు తగ్గడం, నీరసం, చూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి లక్షణాలు ఉన్నవారు త్వరగా అలసిపోతారు. ఉన్నట్టుండి శరీర బరువు తగ్గిపోతారు. కంటిచూపు తగ్గిపోతుంది. కాగా చిన్నపిల్లలకు ఈ వ్యాధి రావడం ఆందోళన కలిగిస్తుంది. షుగర్ వచ్చేందుకు కారణాలు అనేకమున్నాయి. మానసిక ఒత్తిడి, ఊబకాయం, డ్రింక్ చేయడం, ఫాస్ట్ఫుడ్లకు అలవాటు పడడం, శ్రమలేని జీవితం, వంశపారపర్యంగా కూడా వస్తుంది. ఒకే చోట గంటల కొద్ది కూర్చొని పని చేయడం, నిద్రలేకపోవడం వంటి కారణాలతో షుగర్ వ్యాధికి గురవుతున్నారు. జన్యుపరంగా, హార్మోన్ లోపం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులిద్దరికీ ఉంటే 99శాతం పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.
వ్యాయామంతో ఫలితం
చక్కెర వ్యాధి బారిన పడకుండా వాకింగ్, వ్యాయామం, యోగా, ధ్యానం నిత్యం చేయాలి. ఇది ఒక ఔషధంగా పని చేస్తుంది. ఎక్కువగా పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు కచ్చితంగా తీసుకోవాలి. యోగా సాధనతో మంచి ఫలితాలు ఉంటాయి. ఆధునిక ఆహారపు అలవాట్లతో మధుమేహం విజృంభిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్, కూల్డ్రింక్స్, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులకు ఉంటే వారు జాగ్రత్త పడాలి. చిన్నారులను ఇంట్లోనే ఆహారం తయారు చేసి ఇవ్వాలి. బేకరీకి సంబంధించిన ఆహారం, స్వీట్లు, చాక్లెట్లు తగ్గించాలి. వీలైనంత పోషక పదార్థాలు తీసుకోవాలి. పిల్లలు ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ఏడాదికి ఒకసారి కంటి పరీక్ష (రెటినోపతి), గుండెపోటు నిర్ధారించే ఈసీజీ, క్షయ, న్యూమోనియా నిర్ధారించే ఛాతీ ఎక్స్రే చేయించాలి. షుగర్ పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో కొవ్వు శాతాన్ని కొలిచే లిఫిడ్ ప్రొఫైల్ పరీక్షలు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. ఓరల్ గ్లూకోజ్ టెస్టు ద్వారా భవిష్యత్తులో ఈ వ్యాధి వస్తుందో రాదో తెలుసుకునే అవకాశం ఉంది.