ఆదిలాబాద్, నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగి సాగుకు సమాయత్తమవుతుండగా, వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వానకాలంలో 5,56,098 ఎకరాల్లో వివిధ పంటలు వేయగా, ఈ సీజన్లో1,25,705 ఎకరాల సాగు అంచనాతో సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో అత్యధికంగా శనగ 76,618 ఎకరాలు, జొన్న 34,161 ఎకరాల్లో పండించే అవకాశమున్నది. మొత్తంగా 26 వేల టన్నుల ఎరువులు కావాల్సి ఉండగా కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో పుష్కలంగా నీరు ఉండగా, అన్నదాతల్లో ఆనందం కనిపిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో 1,25, 705 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఈ సీజన్లో అత్యధికంగా శనగ 76,618 ఎకరాలు, జొన్న 34,161 ఎకరాలు, గోధుమలు 6,1 92 ఎకరాలు, మక్క 3,520 ఎకరాలు, పల్లి 2,584 ఎకరాలు, వరి 425 ఎకరాలు, 4,589 ఎకరాల్లో మిగతా పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేసి సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. శనగ, జొన్న పంటలను ప్రభుత్వం ఏటా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దీంతో ఈ పంటలు సాగు చేసిన రైతులకు విక్రయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో జొన్న, గోధుమల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో గ్రామా లు, పట్టణాల్లో సైతం ప్రజలు రైతుల వద్ద నుంచి ఈ పంటలు కొనుగోలు చేస్తారు. జిల్లా లో యాసంగి పంటల సాగుకు 26 వేల టన్ను ల ఎరువుల అవసరం కాగా, అధికారులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వానకాలంలో సగటున 1400 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా చెరువులు, వ్యవసాయ బోర్లు, బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. దీంతో యాసంగి పంటలకు అసరమయ్యే సాగునీరు అందుబాటులో ఉంది. దీంతో రైతులు ఆనందంగా ఉన్నారు.
ప్రభుత్వ పథకాలతో..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చాయి. రైతుబంధు, రైతుబీమా, సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయానికి 24 గంటల కరంట్, సాగునీరు, పంటల కొనుగోళ్లలాంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతులకు సర్కారు ఇస్తున్న ప్రోత్సా హం కారణంగా జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది వానకాలంలో 5,56, 098 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఎక్కువగా పత్తి 3.90 లక్షల ఎకరాల్లో పండించారు. ఇతర పంటలతో పోల్చితే ఈసారి పత్తిసాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. క్వింటాలుకు మద్దతు ధర రూ.6025 ఉండగా, ఇంతకంటే ఎక్కువగా క్వింటాలుకు రూ.8 వేల ధర పలుకుతుంది. ప్రైవేట్ వ్యాపారులు పోటీపడి పత్తిని కొనుగోలు చేస్తున్నారు.