నిల్వల పేరిట కొనబోమంటూ స్పష్టం
మంచిర్యాల జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం సాగు
ప్రత్యామ్నాయ పంటలే మేలంటున్న వ్యవసాయశాఖ
అవగాహన కల్పించేందుకు అధికారుల చర్యలు
రైస్ మిల్లులు మూతపడుతాయని యజమానుల ఆందోళన
మంచిర్యాల, సెప్టెంబర్ 13, నమస్తే తెలంగాణ :ఇకపై దొడ్డురకం ధాన్యం కొనబోమని కేంద్రం కరాఖండీగా చెబుతుండగా, వరికి గడ్డుకాలం దాపురించే ప్రమాదమున్నది. ఇప్పటికే భారీగా నిల్వలు పేరుకుపో యాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేయగా, ప్రత్యామ్నాయ పంటలే మేలని వ్యవసాయశాఖ భావిస్తున్నది. ఈ మేరకు యాసంగిలో శనగ, వేరు శనగ, పెసర, మినుము, పొద్దు తిరుగుడు, కూరగాయలు వంటివి పండించేలా రైతులను చైతన్య పరిచేందుకు సన్నద్ధమవుతున్నది. మరోవైపు బీజేపీ సర్కారు నిర్ణయంతో మంచిర్యాల జిల్లాలోని పలు రైస్ మిల్లులు మూతపడే పరిస్థితి ఉండగా, యజమానుల్లో ఆందోళన కనిపిస్తున్నది.
గత యాసంగిలో 2,23,479 మెట్రిక్ టన్నులు..
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి కనీస మద్దతు ధర అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏ-గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ.1888 చొప్పున కొనుగోలు చేసింది. సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.1,868 చొప్పున కొనుగోలు చేసింది. గత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 250 వరి కొనుగోలు కేంద్రాలలో మూడు కొనుగోలు ఏజెన్సీల ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 2,23,479 టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. ఈ యే డాది 2020-21 పంటకాలంలో జిల్లాలో 250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2,23,479 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37,254 మంది రైతు ల వద్ద కొనుగోలు చేసింది. 34,312 మంది రైతు ల ఖాతాల్లో 394 కోట్ల డబ్బులు జమ చేసింది.
మిల్లులు మూతపడే అవకాశం..
మంచిర్యాల జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. కరోనా కాలంలోనూ రైతులకు రాష్ట్ర సర్కారు అండగా నిలవడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఈ యేడాది జిల్లా లో దాదాపు 1,60,000 (1,10,000 ఎకరాల్లో దొడ్డు వరి సాగు) ఎకరాల్లో వరి సాగవుతుండగా, 2 నుంచి 2.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. గతంలో కరోనా సమయంలో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసింది. దీంతో సర్కారుపై అదనపు భారం పడిందని అధికారులు పే ర్కొంటున్నారు. కానీ, ఈయేడాది ఆ పరిస్థితి లేద ని, కేంద్రం నిర్ధారించిన ధాన్యం మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితులున్నాయని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైస్ మిల్లులు మూతపడే అవకాశం ఉందని రైస్మిల్లర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 18 రైస్ మిల్లులు ఉన్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి వ్యవసాయ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తే బాగుండేదని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు.
రైస్ మిల్లులు మూతపడుతాయి..
రామకృష్ణాపూర్, సెప్టెంబర్13 : కేంద్ర ప్రభు త్వం దొడ్డు వడ్లు కొనకపోతే రాష్టంలో ఉన్న బా యిలర్ రైస్ మిల్లులు మూతపడే అవకాశముం ది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో యా సంగికి సన్న రకం వడ్లు పండే పరిస్థితులు లేదు. అందరూ సన్నరకం పండిస్తే సన్న రకాల ధాన్యం నిల్వలు పెరిగిపోతాయి. దీం తో సన్న వడ్లకు కూడా ధర తగ్గిపోయి రైతులు నష్టపోతారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ కేంద్రాల ద్వారా దొడ్డు వడ్లను కూ డా కొనుగోలు చేయాలి. అప్పుడే రైతులకు లాభం చేకూరుతుంది.