సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేదే లేదు
అభివృద్ధి ప్రదాతపై అవాకులు చవాకులు పేలితే జైలుకే..
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్న దళితులు
ముఖ్యమంత్రిని విమర్శించిన కాంగ్రెస్ నేతపై కేసు, రిమాండ్కు తరలింపు
మహబూబ్నగర్, సెప్టెంబర్13(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మదనాపురం: దేవరకద్ర టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాలకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్నాళ్లు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా..అభివృద్ధికి ఐకాన్ అయిన సీఎం కేసీఆర్పై ఇష్టానుసారంగా మాట్లాడాడంటూ ఫైర్ అయ్యారు. సదరు కాంగ్రెస్ నేతపై నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, దళితులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. నోరుంది కదా అని రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని దేవరకద్ర నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిపక్షాలకు చురకలంటించారు.
కాంగ్రెస్ నేతల ఘెరావ్
సీఎం కేసీఆర్పై అనుచితంగా మాట్లాడిన దేవరకద్ర కాంగ్రెస్ నేత కొండా ప్రశాంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టగా 12రోజులపాటు రిమాండ్కు పంపించారు. ప్రశాంత్రెడ్డి ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్నట్లుగా తెలిసిన టీఆర్ఎస్ పార్టీ నేతలు దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. సోమవారం మదనాపురం మండలం దంతనూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు దళిత దండోరా పేరిట కార్యక్రమం చేసేందుకు వస్తే గ్రామంలోని 200మంది దళితులు అడ్డుకున్నారు. వారికి టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన ప్రశాంత్రెడ్డిని అరెస్టు చేసే వరకు కాంగ్రెస్ నేతలను గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వమని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేతలు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మదనాపురం రైల్వే గేటు వద్ద ప్రశాంత్ రెడ్డిని కొత్తకోట పోలీసులు అరెస్టు చేసి ఆత్మకూరు కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి 12రోజుల రిమాండ్ విధించారు.
అనుచితంగా మాట్లాడితే ఊరుకునేదే లేదు
అభివృద్ధి ప్రదాత అయిన సీఎం కేసీఆర్పై అనుచితంగా మాట్లాడితే ఊరుకోమని దళితులు పేర్కొంటున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని గ్రామాల్లో రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ విషయమై ఆగ్రహంగా ఉన్నారు. ప్రజల ఆగ్రహాలకు తోడు టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. సీఎంను విమర్శించిన వ్యక్తిని అరెస్టు చేసే వరకు ఆందోళన చేస్తామని తేల్చి చెప్పడంతో కొత్తకోట పోలీసులు అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రిపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే పాలమూరు అభివృద్ధిలో దూసుకుపోతుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ను విమర్శించే స్థాయి వీరికి లేదని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతిపక్షాల నేతలు గ్రామాల్లో తిరగలేరని టీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రశాంత్రెడ్డి అరెస్టు ప్రతిపక్షాలకు ఓ గుణపాఠం అవుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే తాము ఊరుకోబోమని గ్రామాల్లోని దళితులు స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ను అనుచితంగా మాట్లాడితే వదిలిపెట్టమని భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్ అన్నారు. ప్రశాంత్ రెడ్డి అరెస్టు ఇందుకు ఉదాహరణ అని హెచ్చరించారు.