కరోనా వైరస్ కట్టడికి అన్నీ సిద్ధం
ఆక్సీజన్, రెమిడిసివర్, బెడ్లకు కొరతే లేదు
కొవిడ్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సమీక్ష సమావేశంలో మంత్రి అజయ్కుమార్
ఖమ్మం, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి గురువారం నిర్వహించిన హైపవర్ కమిటీ సమావేశంలో ఇకముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై మంత్రి సమీక్షించారు. పోలీసు, టాస్క్పోర్స్, మెడికల్ అండ్ హెల్త్, డ్రగ్ కంట్రోల్, ఐఎంఏ, మున్సిపాలిటీ ఇతర శాఖల ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సీజన్ లభ్యత, బెడ్లు, మెడిసిన్, ఇంటింటి జ్వర సర్వే తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్లో వైరస్ ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో కొవిడ్ కేసులకు సంబంధించి అత్యధికంగా ప్రభుత్వ ఆసుప్రతుల్లోనే వైద్యం అందించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో ఆక్సీజన్ కొరత లేదని, అవసరాన్ని బట్టి డిమాండ్ మేరకు పంపిణీ చేస్తామని అన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రెమిడెసివర్ మెడిసిన్ అవశ్యకతను కూడా పర్యవేక్షించాలని, అవసరం మేరకు అందించాలని సూచించారు. బ్లాక్మార్కెట్ చేసే వారిపై కేసు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా కట్టడి చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిల్లో కొవిడ్ పేషెంట్లకు వైద్యం అందించే క్రమంలో నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రభుత్వం నిర్ధారించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని, ధరల వివరాలను డిస్ప్లే చేయాలని, అధిక చార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో కొవిడ్ వైద్యం అందించేందుకు ఎంపానల్ చేసుకున్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఆక్సీజన్, రెమిడెసివర్ సరఫరాను పారదర్శకంగా పర్యవేక్షించాలని, టాస్క్పోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో చర్యలు తీసుకొని కట్టడి చేయాలని, తీసుకున్న చర్యల నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలని మంత్రి సూచించారు.
లాక్డౌన్ను ప్రజలందరూ తప్పనిసరిగ్గా పాటించాలని సూచించారు. నిర్ణీత సమయంలోనే నిత్యావసరాలు సమర్చుకోవాలని, పోలీసులకు సహకరించాలని మంత్రి కోరారు. ఇంటింటి జ్వర సర్వేలో కొవిడ్ లక్షణాలు కలిగిన వారిని వైద్య సిబ్బంది గుర్తిస్తున్నారని అన్నారు. మెడికల్ కిట్లను అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారని చెప్పారు. ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు వైద్యం అందించే క్రమంలో పాటిస్తున్న నిబంధనలను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో సీపీ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, డీఆర్వో శిరీష, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు, టాస్క్పోర్స్ ఏసీపీ రామానుజం, ప్రసన్నకుమార్, ఐఎంఏ ప్రతినిధి కూరపాటి ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.