బొమ్మలరామారం, ఏప్రిల్ 5 : మండల కేంద్రం నుంచి నాగినేనిపల్లి, మైలారం, మైలారం తండా, మేడిపల్లి, ఫకీర్గూడ గ్రామాల మీదుగా భువనగిరి మండలం అనంతారం నుంచి జిల్లా కేంద్రాన్ని కలిపే 13 కిలోమీటర్ల రోడ్డు కొన్నేండ్లుగా మరమ్మతులు లేక గుంతలమయంగా మారింది. కొన్నిచోట్ల పూర్తిగా ధ్వంసమైంది. దాంతో ఆ ఐదు గ్రామాల ప్రజలు ఇటు మండల కేంద్రానికి వెళ్లాలన్నా, అటు జిల్లా కేంద్రానికి పోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లు. గుంతల మయంగా మారిన రోడ్డుపై ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితి. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఆస్పత్రికి వెళ్లే రోగులకూ ఇబ్బందులు తప్పేవి కాదు. ఈ క్రమంలో రోడ్డును బాగు చేయించాలని ఐదు గ్రామాల ప్రజలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి విన్నవించారు. దాంతో బీటీ వేయించేందుకు ఆర్అండ్బీ శాఖ నుంచి రూ.1.34కోట్లు మంజూరు చేయించారు. ఇటీవల రోడ్డు పనులు పూర్తిచేయించారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యి ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విఫ్ సునీతకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రూ.1.34 కోట్లు మంజూరు చేయించడం హర్షణీయం. అంతేకాకుండా రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయించడం అభినందనీయం. రోడ్డు నిర్మాణంతో ఐదు గ్రామాల ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలిగిపోయాయి. ఆమెకు ఆయా గ్రామాల ప్రజలు ఎల్లప్పటికీ రుణపడి ఉంటారు.
-వడ్లకొండ అరుణ, సర్పంచ్, మైలారం
వర్షాకాలం వచ్చిందంటే రోడ్లమీద ఏర్పడిన గుంతలతో ఇబ్బంది పడేవాళ్లం. ఈ రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. ప్రభుత్వం రోడ్డు పనులను పూర్తి చేయించడం సంతోషంగా ఉంది. ప్రయాణికుల ఇబ్బందులు తొలిగిపోయినయి.
-బుడమ వెంకటేశ్, మైలారం