త్వరలోనే కొత్త లైట్ల ఏర్పాటు
కేంద్ర పురావస్తు శాఖ క్లియరెన్స్
రూ.9 కోట్లతో ‘కుడా’ ప్రణాళిక
ఇప్పటికే ట్రయల్ రన్, టెండర్ ప్రక్రియ పూర్తి
పనులు ప్రారంభించిన అధికారులు
వరంగల్/ఖిలావరంగల్, జనవరి 12 : కాకతీయుల వారసత్వ సంపద.. ఖిలా వరంగల్ కోట త్వరలోనే ఫసాడ్ లైట్ల వెలుగుల్లో పర్యాటకులకు కనువిందు చేయనుంది. కోటలోని కట్టడాలు, కళాతోరణాలు, శిల్పాలకు ఫసాడ్ లైట్లు ఏర్పాటు చేసేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) రూ.9 కోట్ల హృదయ్ నిధులతో ప్రణాళిక రూపొందించింది. తాజాగా పురావస్తు శాఖ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. ఇప్పటికే ట్రయల్ రన్, టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో బుధవారం పనులు ప్రారంభమయ్యాయి. కోట ఉత్తర, పడమర ద్వారాలకు, కోటలోని నాలుగు వైపుల ఉన్న కాకతీయ కళాతోరణాలు, ఏకశిలగుట్ట, ఖుష్మహల్కు మొత్తం దాదాపు 300 ఫసాడ్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. పనులు పూర్తయితే చారిత్రక కోట అందాలు మరింత మంది పర్యాటకులను ఆకర్షించనున్నాయి.
కాకతీయులు అందించిన వారసత్వ సంపదకు కొత్త వెలుగులు రానున్నాయి. కాకతీయుల చారిత్రక కట్టడాలు త్వరలోనే ఫసాడ్ లైట్ల కాంతుల్లో పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. మొన్నటి వరకు కేంద్ర పురావస్తు శాఖ నుంచి వచ్చిన తిరకాసులతో ఆలస్యమైన ఈ లైట్ల ఏర్పాటుకు ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) రూ.9కోట్ల హృదయ్ నిధులతో కోటలో చారిత్రక కట్టడాలకు, కళాతోరణాలు, శిల్ప సంపదకు ఫసాడ్ లైట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో బుధవాం పనులు ప్రారంభమయ్యాయి. వరంగల్ నగరానికి ‘ఐకాన్’గా ఉన్న ఓరుగల్లు కోటలోని చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్ప సంపద ఫసాడ్ లైట్ల కాంతుల్లో పర్యాటకుల మనసు దోచేలా ఏర్పాట్లు చేయనున్నట్లు కుడా అధికారులు చెబుతున్నారు.
పెరుగనున్న పర్యాటకులు..
కేంద్ర పురావస్తు శాఖ అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్లు కుడా అధికారులు వెల్లడించారు. క్లియరెన్స్ల కోసం ఏడాది కాలంగా ప్రయత్నం చేయడంతో ఇటీవల క్లియరెన్స్లు వచ్చాయని పేర్కొన్నారు. చారిత్రక ఓరుగల్లు కోటలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా కేంద్ర పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం అనుమతులు రావడంతో పనులను వేగంగా చేపట్టనున్నారు. ఇప్పటికే కోటలో చారిత్రక కట్టడాలకు ఫసాడ్ లైట్ల ఏర్పాటుపై కుడా అధికారులు ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడు కుడా, పురావస్తు శాఖల అధికారులు సమన్వయంతో పూర్తిచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నందున ఖిలావరంగల్లోని కాకతీయుల కట్టడాలు ఫసాడ్ లైట్ల ఏర్పాటుతో కొత్త శోభ సంతరించుకోనున్నాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగనుంది.
300 లైట్ల ఏర్పాటు..
ఓరుగల్లు కోటలోని కట్టడాలకు ఫసాడ్ లైట్ల ఏర్పాటు కోసం రూ.9కోట్లతో కుడా అధికారులు ప్రకాణాళికలు చేశారు. చుట్టూ నాలుగు కిలోమీటర్లు ఉన్న రాతి కోటపై విద్యుత్ దీపాల ఏర్పాటు ఇప్పటికే పూర్తయ్యింది. కోట ఉత్తర, పడమర ద్వారాలకు ఫసాడ్ లైట్లు ఏర్పాటు చేసి పర్యాటకులకు స్వాగతం పలుకనున్నారు. వీటితోపాటు కోటలో నలుదిక్కుల ఉన్న నాలుగు కాకతీయ కళాతోరణాలు, ఏకశిలగుట్ట, ఖుష్మహల్కు ఫసాడ్ లైట్లను అమర్చనున్నారు. గణతంత్ర దినోత్సవం నాటికి కోటలోని చారిత్రక కట్టడాలకు సుమారు 300 ఫసాడ్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు కుడా అధికారులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఎల్వర్తి కన్స్స్ట్రక్షన్ సంస్థకు టెండర్ దక్కింది. త్వరలోనే కోటలోని కాకతీయ వారసత్వ కట్టడాలు, శిల్పాలకు ఫసాడ్ లైట్ల ఏర్పాటు షురూ కానుంది.