వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు సర్కారు చర్యలు
సగం సబ్సిడీపై గరిష్ఠంగా రూ.కోటి వరకు ఆర్థిక చేయూత
కొత్త పారిశ్రామిక వేత్తలకు సువర్ణావకాశం
ఈ నెల 15 వరకు గడువు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనాతో ఎన్నో పరిశ్రమలు కుదేలైన పరిస్థితుల్లో కొత్త పారిశ్రామిక వేత్తల అభివృద్ధి పథకం కింద భారీ రాయితీలు కల్పించి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 50 శాతం సబ్సిడీతో నాటు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులకు సంబంధించిన ఫామ్ల ఏర్పాటుకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు సంకల్పించింది. ఈ మేరకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనిష్ఠంగా 35 లక్షల నుంచి గరిష్ఠంగా కోటి రూపాయల వరకు యూనిట్ కాస్ట్తో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా ప్రతి యూనిట్కు 50 శాతం రాయితీని కల్పిస్తున్నది. వ్యక్తులతోపాటు స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యవసాయోత్పత్తుల సంఘాలు లబ్ధి పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పశుగ్రాసం ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్లకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
రాయితీ వర్తింపు ఇలా…
500 గొర్రెలు లేకుంటే మేకలతో పాటు 25 పొట్టేళ్లు, 25 మేక పోతులతో కనిష్ఠంగా యూనిట్ను ఏర్పాటు చేసుకుంటే గరిష్ఠంగా అందించే రూ.కోటి యూనిట్ కాస్ట్లో ప్రభుత్వం 50 శాతం రాయితీని కల్పిస్తోంది. అలాగే వెయ్యి దేశీయ కోళ్లతో రూ.34,25,540 అంచనా వ్యయంతో యూనిట్ను నెలకొల్పినైట్లెతే గరిష్ఠంగా రూ.25లక్షల వరకు రాయితీ పొందవచ్చు. రూ.50లక్షల యూనిట్ కాస్ట్ కింద వంద ఆడ పందులతోపాటు 25 మగ పందులను అందిస్తే.. గరిష్ఠంగా రూ.30లక్షల వరకు రాయితీ లభిస్తుంది. పశుగ్రాసం కోసం ఏర్పాటు చేసుకునే రూ.50లక్షల యూనిట్కు 50 శాతం రాయితీని అందిస్తున్నది.
ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలి
భారీ రాయితీతో అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలి. ఆసక్తిగల లబ్ధిదారులు ఈనెల 15లోపుగా జిల్లా కేంద్రంలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర స్థాయి లో ఏర్పాటైన కేంద్ర ఇంప్లిమెంట్ ఏజెన్సీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.