నేడు అలంకార మహోత్సవం
ఆభరణాల ఊరేగింపునకు ముస్తాబైన ఆత్మకూరు
సంస్థానాధీశుల కాలం నుంచి ప్రాధాన్యం
ఆత్మకూరు, నవంబర్ 8 : తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అలంకారోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు నుంచి ప్రారంభమయ్యే అలంకారణోత్సవానికి అ ధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముక్కెర వంశస్తులు బహూకరించిన బంగారు ఆభరణాలను స్వామి వారికి అలంకరించ డం ఈ ఉత్సవం ప్రత్యేకత. అనాదిగా వస్తున్న ఆచారం ప్ర కారం ఆత్మకూరు ఎస్బీఐ లాకర్లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలను ప్రత్యేక పూజల అనంతరం గాడి వంశీయులు ఆత్మకూరు ప్రధాన వీధులగుండా ఊరేగిస్తారు. పరమేశ్వరస్వామి చెరువు కట్ట వద్దకు చేర్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి వాహనంలో కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపురం రాజా శ్రీరాంభూపాల్ స్వగృహానికి తరలిస్తారు. అక్కడ ఆభరణాలకు పూజలు నిర్వహించి నంబి వంశస్తుల ఆధ్వర్యంలో కాలినడకన కురుమూర్తి గిరులకు చేరుస్తారు. కొండపైకి చేరగానే పాలకమండలి, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆభరణాలను పూజారులకు అప్పగించి స్వామివారికి అలంకరిస్తారు.
300 ఏండ్ల కిందటి ఆభరణాలు..
300 ఏండ్ల కిందట ముక్కెర వంశీయులు రాజా సీతా రాంభూపాల్ హయాంలో బంగారు ఆభరణాలను బహూకరించారు. కిరీటాలు, హారాలు, కనకపు హారాలు, పాదుకలు, పచ్చలహారం, ముత్యాల హారం, వజ్రస్థం, కోరమీసాలు, కెంపులు, శంఖుచక్రాలు తదితర వజ్ర వైఢుర్యాలు పొదిగిన ఆభరణాలు అందజేశారు. నాటి నుంచి ఆత్మకూరు ఎస్బీఐలో భద్రపరుస్తూ వచ్చారు. ఈ ఆచారాన్ని ప్రస్తుతం వారి వంశీయులు రాజా శ్రీరాంభూపాల్రెడ్డి కొనసాగిస్తున్నారు. ఆభరణాలను బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇదిలా ఉం డగా, అలంకారోత్సవానికి ఆత్మకూరు పట్టణం ముస్తాబైంది. ఎన్నడూ లేని విధంగా పోటాపోటీగా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అమరచింత నుంచి పట్టువస్త్రాలు
అమరచింత, నవంబర్ 8 : అలంకారోత్సవంలో భాగంగా అమరచింతలో ప్రత్యేకం గా తయారు చేసిన పట్టువస్ర్తాలను మంగళవారం స్వామివారికి సమర్పించనున్నారు. వారం రోజులుగా నియమనిష్ఠలతో ప్రత్యే క మగ్గంపై స్వామివారికి పట్టుపంచె, అమ్మవారికి పట్టుచీరను నేస్తున్నట్లు పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న తెలిపారు. సోమవారం నాటికి పూర్తిస్థాయిలో వస్ర్తాలు సిద్ధం కాగా.. మంగళవారం ఆత్మకూరు నుంచి బయలుదేరే అలంకారోత్సవం ఊరేగింపులో అమరచింత చేనేతలు పాల్గొంటారు.
ఆభరణాలతో పాటు స్వామివారి పట్టువస్ర్తాలను ఊరేగిస్తారు. 2012 నుంచి అమరచింత పద్మశాలీల ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ ఆనవాయితీని ప్రతి ఏడాది కొనసాగిస్తున్నారు.
సర్వం సిద్ధం : ఎమ్మెల్యే చిట్టెం
ఆత్మకూరు పట్టణం నుంచి ఆరంభమయ్యే కురుమూర్తిస్వామి జాతర ప్రధాన ఘట్టం అలంకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. బ్యాంకు నుంచి ఆభరణాల ఊరేగింపును కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికారులకు పురమాయించాం. మున్సిపాలిటీ నేతృత్వంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అమరచింత నుంచి చేనేతలు తీసుకొచ్చే స్వామివారి పట్టువస్ర్తాల ఊరేగింపునకు సైతం సకల ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం. బ్యాంకులో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కూడా హాజరుకానున్నారు.