కార్పొరేషన్, జూన్ 8: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలోని 48వ డివిజన్లో రూ. 10 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం 33వ డివిజన్లో సాగుతున్న స్మార్ట్సిటీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అన్ని డివిజన్లలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 48వ డివిజన్లో గతంలో నిర్మించిన డ్రైనేజీలు, సీసీ రోడ్లు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మంజూరు చేస్తున్న పట్టణ ప్రగతి నిధులతో డివిజన్లలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రాబోయే రోజుల్లో స్మార్ట్సిటీ కింద రూ. 300 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే బోర్డు మీటింగ్ జరుగుతుందన్నారు. ఇందులో ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ టీవీ సర్వైవ్లైన్స్, రూప్టాప్ తదితర అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. నగరంలో ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను స్మార్ట్సిటీ నిధులతో పరిష్కరించినట్లు వెల్లడించారు. స్మార్ట్సిటీ కింద చేపడుతున్న పనుల్లో సరైన కొలతల ప్రకారం మార్కింగ్ చేసి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. భగత్నగర్ నుంచి గోదాంగడ్డ వరకు రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. ఇరువైపులా సరైన లెవల్స్ పాటిస్తూ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ కల్వర్టులను నిర్మించాలని ఆదేశించారు. కార్పొరేటర్ అనూప్కుమార్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అంతిమయాత్ర పథకానికి విరాళం
నగరపాలక సంస్థ చేపట్టిన రూపాయికే అంతిమయాత్ర పథకానికి సుభాష్నగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి తిరుపతి రూ. 10 వేలు మంగళవారం మేయర్ వై సునీల్రావుకు విరాళం అందజేశారు. మేయర్ మాట్లాడుతూ, విరాళం అందజేయడం అభినందనీయమని కొనియాడారు.