ఇంటింటికీ వెళ్తున్న ప్రత్యేక బృందాలు
కరోనా లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ కిట్ అందజేత
ఆరోగ్యం క్షీణించినవారిని వెంటనే ఆస్పత్రికి తరలింపు
సర్వేను పర్యవేక్షిస్తున్న ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు
ఖమ్మం సిటీ, మే 6: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. మహమ్మారికి కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకుసాగుతున్నది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. తాజాగా జ్వర సర్వేకు శ్రీకారం చుట్టింది. వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘం సభ్యులు, పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలున్నవారికి పరీక్షలు చేసి, అవసరమైనవారిని మెరుగైన చికిత్సకోసం దవాఖానలకు తరలించేలా కార్యాచరణ రూపొందించారు. బృందం సభ్యులు గ్రామాలు, పట్టణాల వారీగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం ఈ బృందాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. యుద్ధప్రాతిపదికన ఇంటింటి సర్వే చేపడుతున్నది. అందుకు గాను ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ బృందాలు జ్వర పీడితులను గుర్తించి వారికి అక్కడికక్కడే ర్యాపిడ్ టెస్ట్లు చేస్తాయి. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి అన్ని శాఖలను సమన్వయం చేసి బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో వైద్యారోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘం సభ్యులు, పంచాయతీ సిబ్బంది ఉంటారు.ఈ బృందాల పర్యవేక్షణకు గెజిటెడ్ అధికారులు ప్రత్యేక అధికారులు నియమితులయ్యారు. ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీవోలు కమిటీలు నియమించారు. గురువారం జిల్లావ్యాప్తంగా సర్వే ప్రారంభమైంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
ఒక్కో బృందానికి రోజుకు 100 ఇండ్లు..
కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. ఇంటింటి సర్వేలో ప్రత్యేక బృందం జ్వర పీడితులను గుర్తించి వెంటనే మెడిసిన్, కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్ కిట్ అందజేస్తున్నది. ఆరోగ్యం క్షీణించిన వారిని దవాఖానకు తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒక ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్, నర్స్, ఐకేపీకి చెందిన సభ్యురాలు, స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు ఉంటారు. సర్వేను ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తుంటారు. సర్కారు ఆదేశాల మేరకు ఒక్కో బృందం రోజుకు 85 నుంచి 100 ఇళ్లను సందర్శిస్తున్నాయి. కనీసం 200 మందిని కలిసి వారి ఆరోగ్యసమాచారం తెలుసుకోవాలి.
సర్వే బృందం విధులు ఇవీ..
కరోనా తగ్గుముఖం పట్టేవరకు జ్వర పీడితుల సర్వే జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేక బృందాలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలి. వారి సంప్రదించిన వారిలో ఎంత మంది జ్వరం, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారు? కిడ్నీ, మధుమేహం వంటి.. ఇతర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారు? అనే విషయాలని గుర్తించి మధ్యాహ్నం 2 గంటలలోపు ఆ సమాచారాన్ని వైద్యాధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలకు అందజేయాలి. అక్కడి నుంచి రిపోర్ట్ నేరుగా కలెక్టరేట్కు వెళ్తుంది. కలెక్టర్ నివేదిక ఆధారంగా వైదారోగ్యశాఖకు సలహాలు సూచనలిస్తారు. సర్వే విషయంలో ఎవరైనా అలసత్వానికి పాల్పడినా, తప్పుడు నివేదికలు అందజేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వే ద్వారా జ్వరంతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. సర్కారు సిబ్బందే ఇంటికి వచ్చి మందులు ఇస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులూ తప్పుతున్నాయి.