సోన్, మే 5 : వ్యాధి లక్షణాలు గుర్తించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఆరోగ్య సర్వేను పక్కాగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులకు సూచించారు. సోన్ మండలంలోని గంజాల్లో ఆరోగ్య సిబ్బంది చేపట్టిన సర్వేను బుధవారం తనిఖీ చేశారు. సర్వే బృందం ప్రతి ఇంటికెళ్లి ఏయే వివరాలు నమోదు చేస్తున్నారో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరోనాతో పాటు సీజనల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో సర్వే నిర్వహించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి అన్ని వివరాలను నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో అశోక్, సర్పంచ్ సందుగారి లావణ్య, నవీన్, కార్యదర్శి సృజిత్, మాజీ ఉప సర్పంచ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులను గుర్తించేందుకే..
సీజనల్ జ్వరాలతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వేలో అన్ని వివరాలు నమోదు చేయాలని డీఆర్వో రమేశ్ రాథోడ్ అన్నారు. నిర్మల్ మండలం డ్యాంగాపూర్లో చేపట్టిన ఆరోగ్య సర్వేను తనిఖీ చేశారు. అన్ని గ్రామాల్లో సర్వే ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుభాష్చందర్, సర్పంచ్ బోనగిరి సరిత, నవీన్, సెక్రటరీ లక్ష్మణ్, అంగన్వాడీ గంగామణి, ఆశ వర్కర్ తలారి లక్ష్మి, ఆయా, వీఆర్ఏ రాజేశ్వర్ ఉన్నారు.