ఎన్డీడీబీ అధికారులకు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ భూమారెడ్డి ఆదేశం
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.246 కోట్లతో విజయ డెయిరీ నిర్మాణం
5లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీ ఏర్పాటు
రాష్ట్ర పాడి పరిశ్రమ కార్యదర్శి అనితా రాజేంద్రన్తో కలిసి పనుల పరిశీలన
త్వరితగతిన పనులు పూర్తిచేయాలి : చైర్మన్ భూమారెడ్డి
పనులను పర్యవేక్షించిన చైర్మన్, అధికారులు
ఇబ్రహీంపట్నం, జనవరి 5 : రంగారెడ్డిజిల్లా రావిర్యాలలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో రూ.246కోట్ల25లక్షల వ్యయంతో మెగా విజయ డెయిరీని నిర్మించడానికి పనులు చకచకా జరుగుతున్నాయి. సుమారు 5లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యంగల ఈ డెయిరీని ఏడాదిలోపు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి రాష్ట్ర పాడి పరిశ్రమ కార్యదర్శి అనితా రాజేంద్రన్తో కలిసి పనులను బుధవారం పర్యవేక్షించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న పాల ఉత్పత్తులతోపాటు నగరానికి పాల ఎగుమతులను పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపారు. గుజరాత్, బెంగళూరుకు సంబంధించిన ఎన్డీడీబీ అధికారులు, డెయిరీ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
వీలైనంత వరకు నిర్ణీత గడువులోగా డెయిరీ నిర్మాణం పనులను పూర్తిచేయడానికి ఒప్పందం ఉన్నప్పటికీ అంతకుముందుగానే పూర్తి చేయాలని చైర్మన్ ఆదేశాలు జారీచేశారు. పాడి పరిశ్రమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పాల ఉత్పత్తిదారులకు విరివిగా రుణాలు అందజేస్తున్నదని.. దీంతో పాల ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశాలున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో మెగా డెయిరీని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు నెలల క్రితమే మెగా డెయిరీ నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటికీ, సాంకేతికపరమైన అనుమతులు రావడానికి ఆలస్యమైంది. బుధవారం అన్ని అనుమతులు వచ్చినందున పనులను అధికారికంగా ప్రారంభించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని ఎన్డీడీబీ అధికారులు తెలిపారు. అనంతరం డెయిరీ నిర్మాణ పనులు జరుగుతున్న ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.