రూ.56 లక్షలతో అభివృద్ధి పనులు
ఆహ్లాదాన్ని పంచుతున్న వన నర్సరీ
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానికులు
పెద్దేముల్, డిసెంబర్ 4 : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులను కేటాయిస్తుండటంతో సర్పంచ్లు వాటిని సక్రమంగా వినియోగిస్తూ గ్రామాల రూపురేఖలను మారుస్తున్నారు.
మండలంలోని రేగొండి గ్రామంలో 1400 మంది జనాభా ఉన్నది. సర్పంచ్ హైదర్ రూ.56 లక్షల 24 వేలతో అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు అన్ని రకాల వసతులను కల్పిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.2లక్షల 20వేలతో పల్లె ప్రకృతివనం, రూ.2లక్షల 15వేలతో డంపింగ్ యార్డు, రూ.6లక్షలతో ట్రాక్టర్, ట్యాంకర్ కొనుగోలు, రూ.20లక్షలతో గ్రామంలోని వీధుల్లో సీసీ రోడ్లు, రూ.9 లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం, రూ.2 లక్షలతో మినీ ట్యాంకులు, రూ.2 లక్షలతో బస్షెల్టర్, రూ.89 వేలతో పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టారు. అంతేకాకుండా శిథిలావస్థకు చేరిన ఐదు ఇండ్లు, పాడుబడ్డ మూడు బావులను పూడ్చివేయించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో వీధి లైట్లను ఏర్పాటు చేయించారు. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ కాలనీలు, వీధులను శుభ్రం చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రధాన రోడ్డుకు ఇరువైపులా గ్రామంలో పలుచోట్ల 400 మొక్కలను నాటి స్థానికులు సంరక్షిస్తున్నారు. పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామంలో పచ్చదనం సంతరించుకున్నది. గ్రామంలోని వన నర్సరీ ఆహ్లాదాన్ని పంచుతున్నది. గ్రామంలోని వారికి ప్రతిరోజూ మిషన్ భగీరథ తాగునీటిని అందిస్తున్నారు. గ్రామాభివృద్ధికి పాలకవర్గ సభ్యులు, ప్రజల కృషి మరువలేమని సర్పంచ్ హైదర్ పేర్కొన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెప్రగతితోనే గ్రామాభివృద్ధి
రేగొండి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా మంజూరు చేస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేస్తూ గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నా. పల్లెప్రగతితో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామాభివృద్ధికి పాలకవర్గం, ప్రజలు సహకరిస్తున్నారు. -హైదర్, రేగొండి సర్పంచ్
ప్రతినెలా గ్రామ సభ నిర్వహణ..
పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం గ్రామానికి కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ప్రతి నెలా పంచాయతీ కార్యాలయంలో సభను నిర్వహించి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల విషయంలో స్థానికుల సూచనలు, సలహాలను తీసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. -మహమ్మద్ జమీల్, పంచాయతీ కార్యదర్శి. రేగొండి గ్రామం