రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లతో రూ.402 కోట్ల ఆదాయం
భారీగా పెరిగిన భూ క్రయవిక్రయాలు
2021లో 80,109 రిజిస్ట్రేషన్లు పూర్తి
అత్యధికంగా చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోనే..
ఈ మండలాల నుంచి రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ
ఈ మూడు మండలాల్లో రోజుకు 100-120 రిజిస్ట్రేషన్లు
రీజినల్ రింగ్రోడ్డుకు గ్రీన్సిగ్నల్రావడంతో చేవెళ్ల డివిజన్లో పెరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు
రంగారెడ్డి, జనవరి 4, (నమస్తే తెలంగాణ):రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్లనున్నది. దీంతో భూముల ధరలకు రెక్కలు రావడంతో పాటు క్రయవిక్రయాలూ భారీగా పెరిగాయి. 2021 సంవత్సరంలో 80,109 రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా, ప్రభుత్వానికి రూ.402.54 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో పనులు ప్రారంభం కానున్న రీజినల్ రింగ్రోడ్డు… చేవెళ్ల-మన్నెగూడ మధ్య నుంచి వస్తుండడంతోపాటు షాబాద్, షాద్నగర్, శంకర్పల్లి మండలాల సమీపం గుండా వెళ్తున్నది. దీంతో చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో అత్యధికంగా భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు కాగా, ప్రభుత్వ ఖజానాకు రూ.100 కోట్లు వచ్చి చేరాయి. ఈ మండలాల్లో రోజుకు 100-120 రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం గమనార్హం. రీజినల్ రింగ్రోడ్డు ప్రభావంతో షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లోని గ్రామాల్లోనూ మొన్నటి వరకు రూ.30నుంచి 50 లక్షలు ఉన్న ఎకరం భూమి, ప్రస్తుతం రూ.కోటికి పైమాటే. చేవెళ్ల-శంకర్పల్లి రహదారిలో నాలుగైదు నెలల కింద ఎకరం రూ.కోటిన్నర ఉండగా, ప్రస్తుతం రూ.3.50 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలుకుతుండడం గమనార్హం.
జిల్లాలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. 2021 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలతో ఏకంగా రూ.402 కోట్ల ఆదాయం సర్కార్ ఖజానాకు చేరింది. జిల్లాలోని చేవెళ్ల రెవెన్యూ డివిజన్లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో అత్యధిక ఆదాయం సమకూరింది. జిల్లాలోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, కందుకూరు, ఫారూఖ్నగర్ మండలాల్లో అధిక మొత్తంలో వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు జరుగగా, కేవలం చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోనే రోజుకు 100-120 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం గమనార్హం.అంతేకాకుండా చేవెళ్ల డివిజన్లో భారీగా పుంజుకున్న రిజిస్ట్రేషన్లతో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోనే రూ.100 కోట్లకుపైగా వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లతో 2021 ఏడాదిలో జిల్లా ఖజానాకు ఫుల్ ఆదాయం వచ్చింది. జిల్లాలో 2021 ఏడాదిలో 80,109 వ్యవసాయ భూముల క్రయవిక్రయాలతో రూ.402.54 కోట్లు, 3818 నాలా దరఖాస్తులతో రూ.27.45 కోట్లు, 5702 సక్సేషన్లతో రూ.3.8 కోట్లు, 229 పార్టీషన్లతో రూ.29.61 లక్షల ఆదాయం జిల్లా ఖజానాకు వచ్చి చేరింది. అదేవిధంగా ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిన అనంతరం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను తాసిల్దార్లకు అప్పగించిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్తో పెరిగిన క్రయవిక్రయాలు..
రీజినల్ రింగ్రోడ్డుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. త్వరలో పనులు షురూ అయ్యే రీజినల్ రింగ్రోడ్డు చేవెళ్ల-మన్నెగూడ మధ్య నుంచి వెళ్తుండడంతోపాటు షాబాద్, షాద్నగర్, శంకర్పల్లి మండలానికి సమీపం నుంచి రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణం కానుండడంతో ఒక్కసారిగా ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్నంటడంతోపాటు భూముల క్రయవిక్రయాలు కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఆరు నెలలుగా జిల్లాలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు అధిక సంఖ్యలో పెరిగాయి. ప్రతిరోజు జిల్లాలోని చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల తాసిల్దార్ల కార్యాలయాలు రిజిస్ట్రేషన్లకు వచ్చే వారితో కిక్కిరిసి పోతున్నది. రీజినల్ రింగ్రోడ్డు ప్రభావంతో షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లోని గ్రామాల్లోనూ మొన్నటి వరకు రూ.30-50 లక్షల్లో ఉన్న ఎకరం వ్యవసాయ భూమి ధర, ప్రస్తుతం అమాంతం రూ.కోటికిపైగా పెరగడం గమనార్హం. అదేవిధంగా చేవెళ్ల-శంకర్పల్లి రహదారిలో నాలుగైదు నెలల క్రితం ఎకరం రూ.కోటిన్నర ఉండగా, ప్రస్తుతం ఏకంగా రూ.3.50 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలుకుతున్నది. అంతేకాకుండా రీజినల్ రింగ్రోడ్డుతో జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మరింత జోష్ వచ్చింది. ఇప్పటివరకు ఔటర్ రింగ్రోడ్డు వరకు ఉన్న లే అవుట్లు, వెంచర్లు రీజినల్ రింగ్రోడ్డు వరకు విస్తరించనున్నది. ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రీజినల్ రింగ్రోడ్డు వెళ్లే అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందనున్నది. కరోనా ప్రభావం అనంతరం ఊపందుకున్న రియల్ వ్యాపారం రీజినల్ రింగ్రోడ్డుకు పచ్చజెండా ఊపడంతో మరింత జోష్ వచ్చింది.
సత్వరమే ధరణి దరఖాస్తుల పరిష్కారం..
రాష్ట్రంలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చే రంగారెడ్డి జిల్లాలో ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ధరణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. జిల్లాలో 2021 ఏడాదిలో వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం దరఖాస్తులను పరిష్కరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లా పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ ధరణి దరఖాస్తులకు సంబంధించి ఒక్కటి కూడా పెండింగ్లో ఉండకుండా చూస్తున్నారు. ప్రతీరోజు 200-300 దరఖాస్తుల వరకు క్లియర్ చేస్తున్నారు. 2021 సంవత్సరంలో ధరణి పోర్టల్కు 99,269 దరఖాస్తులురాగా, డిసెంబర్ 31 వరకు 97,119 దరఖాస్తులను పరిష్కరించారు. మరో 2160 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. గతేడాదిలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 61,552 దరఖాస్తులకు ఆమోదం తెలిపిన రెవెన్యూ యంత్రాంగం, మరో 35,567 దరఖాస్తులకు సంబంధించి వివిధ కారణాలతో తిరస్కరించారు. అదేవిధంగా 2021లో పరిష్కరించిన దరఖాస్తులకు సంబంధించి మ్యూటేషన్-31,540 దరఖాస్తులు, ఆర్గనైజేషన్ పీపీబీ-698, ఆధార్ సీడింగ్-2978, ఎన్ఆర్ఐ-224, గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్-23,225, జీపీఏ-4,690, నిషేధిత జాబితా-8321, పీపీబీ లేకుండా సక్సేషన్-2,747, కోర్టు కేసుల ద్వారా పీపీబీ-871, పాస్బుక్ లేకుండా నాలా-258, అక్వైర్డ్ ల్యాండ్స్-2043, కోర్టు కేసు, ఇంటిమేషన్-8113, అన్లాక్ పీపీబీ ఆఫ్ పీపీ-11,411 దరఖాస్తులను గతేడాది డిసెంబర్ 31వరకు పరిష్కరించారు.
ధరణితో పారదర్శకంగా సేవలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో ప్రజలకు పారదర్శక సేవలందుతున్నాయి. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా ధరణి పోర్టల్ ద్వారా కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. ధరణి పోర్టల్కు వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నాం. గతంలో మాదిరిగా నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే పరిష్కారం చూపుతున్నాం. గతంతో పోలిస్తే జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో 2021లో భారీగా రెవెన్యూ వచ్చింది.