మొక్కులు చెల్లించుకున్న భక్తులు
సదుపాయాలు కల్పించిన నిర్వాహకులు
మొయినాబాద్, ఆగస్టు 2 : రెండు రోజులుగా మండలంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మండల పరిధిలోని సురంగల్, కనకమామిడి, చిలుకూరు, హిమాయత్నగర్, చిన్నమంగళారం తదితర గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య రెండో రోజు బోనాల ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి.
పోచమ్మ, మైసమ్మలకు..
చేవెళ్లటౌన్, ఆగస్టు 2 : మండల పరిధిలోని కుమ్మెర, ఆలూర్, అంతారం, కమ్మెట గ్రామాల్లో పోచమ్మ, మైసమ్మల బోనాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కుమ్మెర సర్పంచ్ బాన్తేజ, కమ్మెట సర్పంచ్ తులసి రాజ్, కుమ్మెర ఉప సర్పంచ్ శ్రీను, నాయకులు ప్రవీణ్, మాధవ గౌడ్, రాంచంద్రయ్య, జంగయ్య, పెంటయ్య తదితరులు ఉన్నారు.
అమ్మవారికి బోనాలు సమర్పణ
శంకర్పల్లి, ఆగస్టు 2 : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతపురంలో సోమవారం అమ్మవారికి బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ చాకలి అశోక్, కోఆప్షన్ సభ్యుడు బీ.వెంకట్రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని మిర్జాగూడ గ్రామంలో ఆదివారం రాత్రి మహిళలు దీపాలతో బోనాల ఊరేగింపును నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌండ్ల రవీందర్, వైస్ ఎంపీపీ రాములమ్మ, ఉప సర్పంచ్ శాంతికిషన్సింగ్, నాయకులు వెంకటేశ్, ఒగ్గు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
షాబాద్, ఆగస్టు 2: మండల కేంద్రంలో పోచమ్మ బోనాల ఊరేగింపు అంగరంగా వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి భక్తులంతా గ్రామ సమీపంలోని పోచమ్మ దేవాలయం వద్ద పూజలు చేశారు.గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.