మామిళ్లగూడెం, నవంబర్ 30: మహిళల భద్రతకు రక్షణ కవచంగా షీ టీమ్ పనిచేయాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. స్త్రీల భద్రతకు మరింత భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఏడు షీ టీమ్లతో మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. మహిళలపై ఆగడాలు హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థినులను వేధించే, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడం, ఈవ్టీజర్ల తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే తీవ్రమైన కేసును నమోదు చేయడం షీటీమ్స్ ముఖ్య బాధ్యతలని అన్నారు. రద్దీ ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి షీ టీమ్ పోలీసులు అక్కడ మఫ్టీలో నిఘా వేసి ఉండాలని సూచించారు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి మహిళలను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేయాలని, సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా అండగా నిలవాలని సూచించారు. ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో కొంతమంది క్షణికానందం కోసం సోషల్ మీడియా వేదికలపై మహిళలపై అనుచిత వాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇతర మార్గాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. షీటీమ్ ఇన్చార్జి సీఐ అంజలి పాల్గొన్నారు.