హుస్నాబాద్లో ప్రారంభమైన మామిడి పండ్ల మార్కెట్
రోజుకు 30 టన్నుల వరకు మామిడి ఎగుమతి
రైతులకు కలిసి వస్తున్న ధర, సమయం
హుస్నాబాద్టౌన్, ఏప్రిల్ 25 : మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ధాన్యంతో పాటు పండ్ల తోటలు భారీగానే పెంచుతున్నారు. ముఖ్యంగా మామిడి తోటల పెంపకంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుండడంతో తోటల సాగు ఏటేటా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మామిడితోటలకు నిలయమైన హుస్నాబాద్ ప్రాంతంలో మామిడి మార్కెట్ ఊపిరిపోసుకుంది. నిన్నటివరకు మామిడికాయలను వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయించాల్సిన పరిస్థితులు ఉండగా, నేడు హుస్నాబాద్లోనే అమ్ముకునే విధంగా మామిడిమార్కెట్ ప్రారంభమైంది. దీంతో రవాణా ఖర్చులు, దూర భారం తగ్గడంతోపాటు సమయం సైతం ఆదా అవుతుండడంతో రైతులు సంతోషం వ్య క్తం చేస్తున్నారు.
హుస్నాబాద్లో ప్రారంభమైన కొనుగోళ్లు..
హుస్నాబాద్ ప్రాంతం వ్యవసాయంతో పాటు మామిడితోటలకు పెట్టింది పేరు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో దాదాపు 700 ఎకరాలకుపైగా బంగినపల్లి, దసిరి, ఇమాయిత్ తదితర రకాల మామిడి తోటలను పెంచుతున్నారు. ఇక్కడ పండిన పంటను విక్రయించేందుకు గాను స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో రైతులు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయించేవారు. ఈ ఏడాది వ్యవసాయ మార్కెట్ కమిటీ మామిడి కొనుగోలుకు వ్యాపారికి లైసెన్సు జారీ చేసింది. దీంతో హుస్నాబాద్లో ఈ నెల 17వ తేదీ నుంచి మామిడి పండ్ల మార్కెట్ తెరుచుకుంది. స్థానికంగానే మార్కెట్ ప్రారంభం కావడంతో ఆయా గ్రామాలకు చెందిన మామిడితోటల రైతులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మామిడి మార్కెట్ జోరుగా సాగుతున్నది.
వరంగల్, కరీంనగర్ కంటే ఎక్కువ ధర…
స్థానికంగానే మార్కెట్ ప్రారంభం కావడంతో పాటు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు పెద్దసంఖ్యలో హుస్నాబాద్కు తరలివస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ మార్కెట్లో చెల్లిస్తున్న ధరలకంటే అధికంగా ఇక్కడ చెల్లింపులు జరుగుతుండటంతో రైతులు పం టను అమ్ముకునేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో భారీగా కొనుగోళ్లు సాగుతున్నాయి. బంగినపల్లి పెద్దసైజు కాయ టన్నుకు రూ.40వేలకు పైగా ధర పలుకుతుండడంతో రైతులు స్థానికంగానే విక్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చెల్లిస్తున్న రోజువారి మార్కెట్ ధరలను అనుసరిస్తూ స్థానికంగా రైతులకు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
హుస్నాబాద్ నుంచి
వివిధ రాష్ర్టాలకు ఎగుమతి..
బంగినపల్లి మామిడిపండ్లకు తెలంగాణ రాష్ట్రం పెట్టింది పేరు. వివిధ రాష్ర్టాలతో పాటు విదేశాల్లో సైతం ఈ మామిడిపండ్లకు భలే డిమాండ్ ఉంది. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో అత్యధికంగా బంగినపల్లి మామిడి తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది భారీగా కాసిన మామిడి పంట మార్కెట్కు పెద్దసంఖ్యలో తరలివస్తున్నది. కొనుగోలు చేసిన పండ్లను ఎప్పటికప్పుడు కూలీలతో బుట్టల్లో ప్యాకింగ్ చేయిస్తున్నారు. ఇలా ప్యాకింగ్ చేసిన పండ్లను హుస్నాబాద్ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 టన్నుల వరకు ఎగుమతి కావడం విశేషం. నిత్యం లక్షలాది రూపాయల వ్యాపారం సాగుతున్నది.